HYD : కుక్క కరిచిందని యాజమానితో మహిళ వాగ్వాదం.. పోలీసులకు ఫిర్యాదు చేయగా..

ABN , First Publish Date - 2021-08-29T16:47:28+05:30 IST

ఎదురింటి వారి పెంపుడు కుక్కలు దాడి చేసి కరిచాయంటూ..

HYD : కుక్క కరిచిందని యాజమానితో మహిళ వాగ్వాదం.. పోలీసులకు ఫిర్యాదు చేయగా..

హైదరాబాద్ సిటీ/కొత్తపేట : మన్సూరాబాద్‌ వీకర్‌ సెక్షన్‌ కాలనీలో ఎదురింటి వారి పెంపుడు కుక్కలు దాడి చేసి కరిచాయంటూ ఓ మహిళ ఫిర్యాదు మేరకు, వాటి యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. మన్సూరాబాద్‌ వీకర్‌ సెక్షన్‌ కాలనీలో ఉండే యంజాల సురేష్‌(47) ఇంట్లో రెండు శునకాలను పెంచుకుంటున్నాడు. వాటిని కట్టేయకుండా వదలడంపై ఎదురింట్లో ఉండే బ్యాగరి స్వప్న(30) శుక్రవారం అతడిని ప్రశ్నించింది. దీంతో  ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆమెను తోసేందుకు అతడు యత్నించాడు. అదే సమయంలో అతడి పెంపుడు కుక్కలు ఆమెపై దాడి చేసి కరిచాయి. ఆమె చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి. గతంలో కూడా ఒకసారి అతడి పెంపుడు కుక్క కరిచిందని ఆమె తెలిపింది. శనివారం బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి, సురేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌ఓ అశోక్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-08-29T16:47:28+05:30 IST