కరోనా వైరస్ నియంత్రణకు శునకాల సాయం: శాస్త్రవేత్తలు

ABN , First Publish Date - 2020-11-24T22:24:45+05:30 IST

కరోనా మహమ్మారి చొరబడినప్పుడు దేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. ముఖ్యంగా వైరస్‌ను గుర్తించేందుకు అవసరమైన కిట్లు అందుబాటులో

కరోనా వైరస్ నియంత్రణకు శునకాల సాయం: శాస్త్రవేత్తలు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి చొరబడినప్పుడు దేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. ముఖ్యంగా వైరస్‌ను గుర్తించేందుకు అవసరమైన కిట్లు అందుబాటులో లేవు. అయితే, ఆ తర్వాత ఆ సవాళ్లను అధిగమించగలిగాం. నమూనాలు సేకరించి నిర్ధారణ కోసం ఎక్కడెక్కడికో పంపించాం. దాదాపు ప్రపంచం మొత్తం ఇటువంటి సవాళ్లే ఎదుర్కొంది. అయితే, శునకాలు కూడా కరోనా వైరస్‌ను గుర్తించగలవని, వాటికున్న గొప్ప ఘ్రాణశక్తి ద్వారా వైరస్‌ను పూర్తి కచ్చితత్వంతో గుర్తిస్తాయని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. 


కరోనా వైరస్‌‌ను గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా శునకాలకు శిక్షణ ఇస్తున్నారు. వైరస్‌ను గుర్తించే విషయంలో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని శునక శిక్షకులు చెబుతున్నారు. కరోనా వైరస్‌ నియంత్రణ విషయంలో శునకాల సాయం తీసుకోవచ్చిన శాస్త్రవేత్తలు కూడా నమ్మకంగా చెబుతున్నారు. విమానాశ్రయాలు, మార్కెట్ల వంటి రద్దీ ప్రదేశాలలో కరోనా ఉన్న వారిని పెద్ద ఎత్తున గుర్తించే వీటిని చక్కగా ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం వైరస్‌ను గుర్తించేందుకు చేస్తున్న ఖర్చుతో పోలిస్తే ఇది చాలా చవకని అంటున్నారు. అయితే, మానవుల్లో కరోనా వైరస్ వాసనను శునకాలు గుర్తిస్తాయని ఎక్కడా పేర్కొనలేదు. కాబట్టి శాస్త్రీయ సమాజం ఈ ఫలితాలను సమీక్షించలేదు. కరోనావైరస్ సంక్రమణను గుర్తించే శునకాలపై ఈ ఫలితాల సమీక్షలు లేకపోవడం వల్ల తాజా ఫలితాలను నిర్ధారించే అవకాశం లేకుండా పోయింది.  


జంతువులు కరోనా వైరస్‌ను గుర్తించగలవని చెబుతున్న కొందరు మాత్రం ఆ దిశగా ప్రయోగాలు చేస్తున్నారు. ఈనెల 3న ‘ఇంటర్నేషనల్ కె9 బృందం’ పేరుతో నిర్వహించిన ఆన్‌లైన్ వర్క్‌షాపులో కలుసుకున్న వీరు తమ ప్రయోగాలకు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. శునకాల ద్వారా కరోనా వైరస్‌ను గుర్తించవచ్చని హోల్గర్ వోల్క్ అనే వెటర్నరీ న్యూరాలజిస్ట్ తెలిపారు. వైరస్‌ను గుర్తించే విషయంలో ఆయన శునకాలకు తర్ఫీదునిస్తున్నాడు. 


‘‘పీసీఆర్ మిషన్లను మార్చేయాలని ఎవరూ చెప్పడం లేదు. అయితే, శునకాలు కూడా వైరస్‌ను గుర్తించడంలో చాలా నమ్మకమైనవే’’ అని హోల్గర్ వోల్క్ పేర్కొన్నారు. కేన్సర్, మలేరియాను గుర్తించేందుకు శునకాలకు శాస్త్రవేత్తలు శిక్షణ ఇచ్చినప్పటికీ నిజానికి అవి దేనిని వాసన చూస్తున్నాయన్నది తెలుసుకోవడం కష్టమన్నారు. కాబట్టి వారు ఈ విషయంలో శునకాలను ఉయోగించడం లేదన్నారు. 


 కరోనా వైరస్ కబళించడం మొదలుపెట్టిన తర్వాత చాలామంది శాస్త్రవేత్తలు వైరస్‌ను గుర్తించేందుకు స్నిఫ్పర్ డాగ్స్‌కు శిక్షణ ఇచ్చారు. ముఖ్యంగా చెమట, వారి అడుగుల ద్వారా కొవిడ్ ఇన్ఫెక్షన్‌ను గుర్తించేలా తర్ఫీదు ఇచ్చారు. అమెరికా, యూఏఈ, ఫిన్‌ల్యాండ్, లెబనాన్ విమానాశ్రయాల్లో స్నిప్ఫర్ డాగ్స్‌తో కరోనా వైరస్‌ను గుర్తించేందుకు ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల చెమట ద్వారా వైరస్‌ను గుర్తించేలా వీటికి శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన ఫలితాలను అనుమతించిన పద్ధతుల ద్వారా వాటిని పరీక్షిస్తారు.


ప్రయాణికుల్లో కొవిడ్ లక్షణాలు బయటపడడానికి ముందే లెబనాన్, ఫిన్లాండ్‌లలో శునకాలు వైరస్‌ను గుర్తించినట్టు అక్కడి గణాంకాలు చెబుతున్నాయి. లెబనాన్‌లో 1,680 మంది ప్రయాణికులను శునకాలు స్క్రీన్ చేయగా, వారిలో 158 (92 శాతం) కరోనా వైరస్ కేసులను గుర్తించాయి. ఆ తర్వాత వారికి నిర్వహించిన పీసీఆర్ టెస్టుల్లోనూ వారికి వైరస్ ఉన్నట్టు తేలడం గమనార్హం. ఇది చాలా కచ్చితమైనది, చవకైనది అని బీరుట్‌లోని సెయింట్ జోసెఫ్ యూనివర్సిటీ సర్జన్, రీసెర్చర్ రియాద్ సర్కిస్ తెలిపారు.

Updated Date - 2020-11-24T22:24:45+05:30 IST