అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. మూడో డిబేట్‌లో కీలక మార్పు..!

ABN , First Publish Date - 2020-10-20T21:16:40+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి.. నవంబర్ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. మరోసారి గెలిచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.. ట్రంప్‌ను ఓడించి.. అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలని డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ కూడా శతవిధాలా ప్రయత్నిస్తున్నారు..

అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. మూడో డిబేట్‌లో కీలక మార్పు..!

రచ్చకు ఛాన్స్ ఇవ్వకుండా ప్రత్యేకంగా ‘మ్యూట్ బటన్’ ఏర్పాటు..!


వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి.. నవంబర్ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. మరోసారి గెలిచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.. ట్రంప్‌ను ఓడించి.. అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలని డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ కూడా శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.. అమెరికాలో నిరుద్యోగం, విదేశాంగ విధానం, కరోనా మహమ్మారి.. వంటి అంశాలు ఈ ఎన్నికల్లో కీలక అంశాలుగా మారాయి.


కాగా.. ఎన్నికల ప్రచారం ముగింపునకు చేరుకోవడంతో అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగే మూడో ప్రెసిడెన్షియల్ డిబేట్‌పై అమెరికా అంతటా ఆసక్తి కనపరుస్తోంది.. కరోనా తర్వాత జో బైడెన్‌తో తొలి డిబేట్ ఇదే కావడం గమనార్హం. అక్టోబర్ 22వ తారీఖున జరగబోయే ఈ డిబేట్‌లో సరికొత్త పద్ధతికి ‘కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్’ శ్రీకారం చుట్టింది. ఒకరు మాట్లాడుతోంటే.. మరొకరు మధ్యలో అడ్డుపడి చర్చను పక్కదోవ పట్టిస్తున్నారనీ.. దీనికి చెక్ పెట్టేందుకు సరికొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నామని తెలిపింది. ఓ అభ్యర్థి ప్రసంగానికి మరొకరు అడ్డుతగలకుండా ఉండేందుకు ప్రత్యర్థి మైక్‌ను ‘మ్యూట్’లో పెట్టాలని నిర్ణయించింది. తద్వారా ఆయా అంశాలపై అర్థవంతమైన చర్చ జరుగుతుందని డిబేట్స్‌ను నిర్వహించే కమిటీ అభిప్రాయపడింది. ఇదిలా ఉండగా ఈ ‘మైక్ మ్యూట్’ సదుపాయ ఏర్పాటుపై డోనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జో బైడెన్‌కు లబ్ది చేకూర్చేందుకు కమిటీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. అయినప్పటికీ తాను చర్చలో పాల్గొంటానని ట్రంప్ తేల్చిచెప్పారు.. 


వాస్తవానికి అధ్యక్ష అభ్యర్థుల మధ్య మొత్తం మూడు డిబేట్లు జరగాల్సి ఉంది.. సెప్టెంబర్ 29న ట్రంప్, జో బైడెన్ మధ్య ఓ డిబేట్ జరిగింది.. ఈ డిబేట్‌లో చాలా రచ్చ రచ్చ జరిగింది. వ్యక్తిగత దూషణలకే అభ్యర్థులు పరిమితమయ్యారు.. ఈ చర్చ జరిగిన రెండ్రోజులకే ట్రంప్ కరోనా బారిన పడ్డారు.. దీంతో రెండో డిబేట్‌ను వర్చువల్ పద్ధతిలో నిర్వహించాలని కమిటీ అభిప్రాయపడింది.. దీనికి ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ డిబేట్‌ను మొత్తానికే రద్దుచేశారు. తాజాగా అక్టోబర్ 22న మూడో డిబేట్ జరగబోతోంది. మరి అత్యంత కీలకమయిన ఈ డిబేట్‌లో ట్రంప్, జో బైడెన్ ఏఏ అస్త్రాలతో ప్రత్యర్థిని ఇరుకునపెడతారో.. ఎవరు పై చేయి సాధిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.. 

Updated Date - 2020-10-20T21:16:40+05:30 IST