విరాళాలు వేసుకొని...పూడికలు తొలగించి
ABN , First Publish Date - 2021-08-02T04:53:58+05:30 IST
తోటపల్లి ఆయకట్టు రైతులు కాలువల్లో పేరుకుపోయిన పూడిక, పిచ్చిమొక్కలు తొలగించేందుకు నడుంబిగించారు.
నడుంబిగించిన తోటపల్లి ఆయకట్టు రైతులు
పాలకొండ: తోటపల్లి ఆయకట్టు రైతులు కాలువల్లో పేరుకుపోయిన పూడిక, పిచ్చిమొక్కలు తొలగించేందుకు నడుంబిగించారు. విరాళాలు వేసుకొని యంత్రాలతో పూడి కను తొలగిస్తున్నారు. తోటపల్లి ఎడమ ప్రధాన కాలువలతో పాటు పిల్ల కాలువల్లో పూడిక వల్ల శివారు ఆయకట్టుకు నీరందడం లేదు. ప్రధానంగా పాలకొండ మండలంలోని కోటపల్లి నుంచి వెలగవాడ వరకు పిచ్చిమొక్కలతో కాలువలు నిండి ఉండడంతో నీటి ప్రవాహం ముందుకు సాగడంలేదు. దీంతో సకాలంలో వరి నాట్లు వేయలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. కాలువల్లో పూడికలు, పిచ్చిమొక్కలను తొలగించాలని అధికారులను రైతులు కోరగా నిధులు లేవని చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో లుంబూరు రైతులు రూ.లక్షా 50 వేల వరకు సేకరించి ప్రొక్లైనర్తో కాలువల్లో పూడికలను తొలగిస్తున్నారు. ఈ కోవలోనే గుడివాడ, ఓని, వెలగ వాడ, రుద్రుపేట గ్రామాల రైతులు పిచ్చిమొక్కలను తొలగించేం దుకు నిధులు సేకరిస్తున్నారు. ఒక్కో రైతు ఎకరాకు రూ.200 నుంచి ఆర్థిక పరిస్థితి బట్టి ఎంత వీలైతే అంత ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని, కాలువల్లో పిచ్చిమొక్క లు, పూడిక తొలగించి ఖరీఫ్కు పూర్తిస్థాయిలో సాగునీరందించాలని ఎల్ఎల్పురం రైతు వారాడ సుమంత్నాయుడు, తదిత రులు కోరుతున్నారు.