మానవత్వం పరిమళించే...
ABN , First Publish Date - 2020-04-09T10:14:23+05:30 IST
ముఖ్యమంత్రి సహాయ నిధికి పొగాకు వ్యాపారులు రూ.15 లక్షలు విరాళం అందజేశారు.
సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ
(ఆంధ్రజ్యోతి న్యూస్నెట్వర్క్):ముఖ్యమంత్రి సహాయ నిధికి పొగాకు వ్యాపారులు రూ.15 లక్షలు విరాళం అందజేశారు. కలెక్టరేట్లో బుధవారం ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య, ఇండియన్ టుబాకో అసోసియేషన్ (ఐటీఏ) అధ్యక్షుడు మద్ది వెంకటేశ్వరరావు, కార్యదర్శి కర్పూరపు శాంతిభూషణ్, జీవైఎన్ బాబు తదితరులు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్కుమార్కు చెక్కు అందజేశారు. పొగాకు వ్యాపారులు పీఎం సహాయ నిధికి రూ.30లక్షలు, కర్ణాటక సీఎం సహాయనిధికి రూ.15, ఏపీ సీఎం సహాయ నిధికి రూ.60 లక్షలు విరాళం అందజేసినట్లు తెలిపారు.
నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ, ఆర్వీఆర్ అండ్ జేసీ తరపున సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ రూ. 28 లక్షలు విరాళం ప్రకటించారు. అందులో రూ. 5 లక్షలు పీఏం కేర్, మరో రూ. 5 లక్షలు సీఏం సహాయ నిధికి, మరో రూ. 5లక్షలు పోలీస్ శాఖకు, మరో రూ. 5 లక్షల 62వేల 500లను అక్షయ ఫౌండేషన్ ద్వారా 7500 మందికి అన్నదానం నిమిత్తం కేటాయించారు. ఆర్వీఆర్ అండ్ జేసీ సిబ్బంది ఒక రోజు వేతనం రూ.7,37,500 శానిటరీ, పారామెడికల్ సిబ్బందికి కేటాయించారు. మొత్తం రూ. 28 లక్షలు ఆయా ప్రభుత్వాలకు విరాళంగా అందిస్తున్నట్లు డాక్టర్ రాయపాటి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆర్వీఆర్ అండ్ జేసీ కళాశాల కార్యదర్శి డాక్టర్ రాయపాటి గోపాలకృష్ణ, కోశాధికారి డాక్టర్ కొండబోలు కృష్ణప్రసాద్లు అర్బన్ పోలీస్ అధికారి, డీఐజీ పీహెచ్డీ రామకృష్ణకు రూ. 5లక్షలు చెక్కు ఇచ్చారు.
ముఖ్యమంత్రి సహాయనిధికి తెనాలి పట్టణానికి చెందిన హెల్త్ హాస్పిటల్ యాజమాన్యం తరపున డాక్టర్ దాసం లక్ష్మణరాజు రూ.లక్ష విరాళాన్ని ఎమ్మెల్యే శివకుమార్కు చెక్కు రూపంలో అందజేశారు.
నరసరావుపేటలోని ఏఎంరెడ్డి విద్యాసంస్థల నిర్వాహకులు సీఎం సహాయనిధికి రూ. ఒక లక్ష చెక్, నరసరావుపేట కళావేదిక రూ.లక్ష, సాయిగ్రాండ్ లాడ్డి ఆవుల సుబ్బారావు రూ.లక్ష, పీఎన్సీ, కేఆర్ సొసైటీ రూ.50 వేలు, ఏజేఎస్ జువెలర్స్ సంస్థ రూ.50 వేలు, కసిరెడ్డి వెంకట కోటిరెడ్డి రూ.50 వేలు, అపిరాల హరిప్రపాదు రూ.50 వేలు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి అందజేశారు.
వినుకొండ పట్టణంలోని సాయి డిగ్రీ కళాశాల యాజమాన్యం సీఎం సహాయ నిధికి రూ. 50వేల చెక్కును ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు అందజేశారు.
చిలకలూరిపేట పురుషోత్తమపట్నానికి చెందిన తోట హరిన్కుమార్, వైష్ణవిలు సీఎం సహాయనిధికి రూ.50వేల చెక్కును ఎమ్మెల్యే విడదల రజినికి అందించారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పొన్నూరుశాఖ ఆధ్వర్యంలో సీఎం సహాయనిధికి రూ.3.05 లక్షల డీడీని డాక్టర్లు నాదెళ్ళ వెంకటరమణారావు, దినేష్, రూత్రాణి, రవీంద్రనాధ్ఠాగూర్ అందజేసినట్లు ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య బుధవారం తెలిపారు. పొన్నూరు లయన్స్ పాలిసర్వీస్సెంటర్ చైర్మన్ ఆకుల సాంబశివరావు రూ.1,02,116, పట్టణ టింబర్ డిపో అసోసియేషన్ అధ్యక్షుడు గోపాళం సుబ్బారావు రూ.50వేలు చెక్కులు అందజేశారు.
మాచర్ల పట్టణంలోని వాసవీ టవర్స్ ఆధ్వర్యంలో సీఎం సహాయనిధికి రూ.50 వేల చెక్కును ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అందించారు.
జోసిల్ వితరణ రూ.25లక్షలు
మేడికొండూరు, ఏప్రిల్ 8: కరోనాపై పోరుకు మేడికొండూరు మండలంలోని జోసిల్ లిమిటెడ్ సంస్థ ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షల సాయం అందజేసింది. ఈ మేరకు జోసిల్ ఎండీ జాగర్లమూడి మురళీమోహన్ బుధవారం తెలిపారు. ఆంధ్రా షుగర్స్ గ్రూపు సంస్థల నుంచి రూ. 2.85 కోట్లు సాయం అందించగా అందులో జోసిల్ లిమిటెడ్ సంస్థ పాతిక లక్షల రూపాయలు అందించింది.
ఈ రెండు కోట్ల సాయాన్ని ఆంధ్రాషుగర్స్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పెండ్యాల అచ్యుత రామయ్య ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి అందజేశారు. అంతేకాకుండా గ్రామాల్లో వెదజల్లేందుకు రూ.80 లక్షల విలువైన 800 మెట్రిక్ టన్నుల సోడియం హైపోక్లోరైట్, 7,500 లీటర్ల హ్యాండ్ శానిటైజర్ను ప్రభుత్వానికి అందజేసినట్టు జోసిల్ ఎండీ మురళీ మోహన్ తెలిపారు.