కరోనా కట్టడికి దాతల సహకారం అవసరం
ABN , First Publish Date - 2020-03-30T11:16:07+05:30 IST
కరోనా వైరస్ అరికట్టడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. దాతల సహకారం లేనిదే ఫలవంతం కాదని కలెక్టర్ భరత్ గుప్తా తెలిపారు.
కలెక్టర్ భరత్ గుప్తా
చిత్తూరు కలెక్టరేట్, మార్చి 29: కరోనా వైరస్ అరికట్టడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. దాతల సహకారం లేనిదే ఫలవంతం కాదని కలెక్టర్ భరత్ గుప్తా తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో దాతలు, స్వచ్చంధ సంస్థలు తమ దాతృత్వాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు. నగదు, వస్తు, నిత్యావసర సరుకులు రూపంలో సాయం చేయొచ్చన్నారు.
నగదును చిత్తూరు కలెక్టర్ లేదా సీఎం రిలీఫ్ ఫండ్ ఆంధ్రప్రదేశ్ కింద లేదా ఏపీ ప్రభుత్వం పేరుతో చెక్, డిమాండ్ డ్రాఫ్టు ఇవ్వాలని చెప్పారు. చెక్కు వెనుక దాతల పేర్లు, చిరునామా, సెల్నెంబరు స్పష్టంగా రాయాలన్నారు. నగదు విరాళాలు పంపినవారికి ఆదాయపు పన్ను వందశాతం మినహాయింపు ఉందన్నారు. ఆన్లైన్ విరాళాలకు తక్షణమే రశీదుల డౌన్లోడ్ సౌకర్యం ఉందని పేర్కొన్నారు. మాస్కులు, శానిటైజర్లు, కూరగాయలు, నిత్యావసర వస్తువులను సమీపంలోని సబ్కలెక్టరేట్, ఆర్డీవో, తహసీల్దార్, మున్సిపల్, నగరపాలక సంస్థ కార్యాలయాల్లో అందచేయవచ్చని సూచించారు.