అన్నదాతలూ.. ఆందోళన వద్దు
ABN , First Publish Date - 2021-05-08T06:03:53+05:30 IST
రైతులు పండించిన పంటను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి పేర్కొన్నారు.
టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి
గజ్వేల్, మే 7: రైతులు పండించిన పంటను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి పేర్కొన్నారు. గజ్వేల్ పట్టణంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో రైతులు ఇబ్బందులు పడవద్దని భావించిన కేసీఆర్ రాష్ట్రంలోని ప్రతీ గ్రామానికి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారని వివరించారు. మద్దతు ధరకు ప్రభుత్వం ప్రతీ గింజను కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. పొళ్లు, తాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. అంతేకాకుండా ధాన్యం కొనుగోలు చేసిన 72గంటల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు పడేలా అన్ని ఏర్పాట్లు చేసి, నిధులు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతున్నదన్నారు.