వ్యక్తిగత దూషణలను సహించం
ABN , First Publish Date - 2021-01-17T05:49:05+05:30 IST
ఉద్యోగులకు రక్షణ కవచంలా జేఏసీ పని చేస్తుందని జేఏసీ చైర్మెన్, డీఆర్వో పుల్లయ్య అన్నారు.
- జేఏసీ చైర్మన్, డీఆర్వో పుల్లయ్య
- రేపటి నుంచి నిరసన కార్యక్రమాలు
కర్నూలు(అర్బన్), జనవరి 16: ఉద్యోగులకు రక్షణ కవచంలా జేఏసీ పని చేస్తుందని జేఏసీ చైర్మెన్, డీఆర్వో పుల్లయ్య అన్నారు. జిల్లా ఆల్ ఎంప్లాయీస్ జేఏసీ ఏర్పాటు చేసినట్లు శనివారం ఆయన ప్రకటించారు. తన ఛాంబర్లో జిల్లాలోని అన్ని ఉద్యోగ సంఘాల నాయకులతో తొలి సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులపై వ్యక్తిగత దూషణలకు వ్యతిరేకంగా నిరసన కార్యాచరణను కలెక్టర్, ఎస్పీ రూపొందించారని తెలిపారు. ఈ నెల 18 నుంచి 23వ తేదీ వరకు భోజన విరామ సమయంలో జిల్లా కేంద్రం మొదలు మండల కేంద్రం వరకు నల్లబ్యాడ్జీలతో మౌన ప్రదర్శన, నిరసన తెలియజేయాలని జేఏసీ నిర్ణయం తీసుకుందన్నారు. కలెక్టర్, ఎస్పీని వ్యక్తిగతంగా దూషించడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ గాంధీ విగ్రహం, తహసీల్దారు కార్యాలయాల వద్ద జేఏసీల ఆధ్వర్యంలో శాంతియుత ఆందోళన చేస్తామని తెలిపారు. జిల్లాలోని అన్ని శాఖల అఽధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని వ్యక్తిగతంగా దూషిస్తే జిల్లా, మండల జేఏసీ జోక్యం చేసుకుంటుందని తెలిపారు. జిల్లా అధికారుల సంక్షేమ సంఘం ఎంకేవీ శ్రీనివాసులు, ట్రెజరర్ డాక్టర్ రమణయ్య, ఈసీ మెంబర్ తిమ్మప్ప, ఏపీ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు, ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా కార్యదర్శి జవహర్లాల్ పాల్గొన్నారు.