జమ్మూకశ్మీర్‌పై ఆ తప్పుచేయకండి: గులాం నబీ ఆజాద్

ABN , First Publish Date - 2021-10-25T01:52:27+05:30 IST

జమ్మూకశ్మీర్‌ విషయంలో తమ డిమాండ్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మరోసారి కేంద్రం ముందు ఉంచారు. మొదట నియోజకవర్గాల..

జమ్మూకశ్మీర్‌పై ఆ తప్పుచేయకండి: గులాం నబీ ఆజాద్

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ విషయంలో తమ డిమాండ్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మరోసారి కేంద్రం ముందు ఉంచారు. మొదట నియోజకవర్గాల పునర్విభజన చేసి ఆ తర్వాత రాష్ట్ర హోదా ఇవ్వాలనుకుంటే అది పొరపాటే అవుతుందని, అలాంటి తప్పు చేయవద్దని అన్నారు. జమ్మూకశ్మీర్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మూడు రోజుల పర్యటనలో ఉన్న సమయంలోనే ఆజాద్  తాజా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.


''కశ్మీర్ నేతలను ప్రధాన మంత్రి తన ఇంటికి ఆహ్వానించినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను. తామంతా ముందు రాష్ట్ర హోదా కోరుకుంటున్నామని, ఆ తర్వాతే ఎన్నికలని చాలా గట్టిగా చెప్పాం. ఇతర పార్టీలు కూడా ఇదే డిమాండ్ చేశాయి. రాష్ట్ర హోదా మంజూరు చేస్తాం, డీలిమిటేషన్ కమిషన్ నివేదిక ఇస్తుంది అని హోం మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే రాష్ట్ర హోదా ఇస్తామంటే అది పొరపాటే అవుతుంది. ఆ పని చేయవద్దు'' అని ఆజాద్ పేర్కొన్నారు. ముందు ఎన్నికలు జరిపిన తర్వాతే రాష్ట్ర హోదా ఇవ్వాలని అనుకుంటున్నట్టు కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రం రెండుగా విభజించడం వల్ల తాము చాలా కోల్పోయామని, అసెంబ్లీ రద్దుతో ఎంతో కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


''370వ అధికరణ రద్దు చేస్తే జమ్మూకశ్మీర్ స్వరూపమే మారిపోతుందని మాతో చెప్పారు. వృద్ధి, ఆసుపత్రులు, ఉద్యోగాలపై ఎంతో శ్రద్ధ తీసుకుంటామన్నారు. కానీ, అవేవీ జరగలేదు. నిజం చెప్పాలంటే, జమ్మూకశ్మీర్‌లో వివిధ ముఖ్యమంత్రుల హయాంలోనే ఎంతో మెరుగ్గా ఉన్నాం'' అని ఆజాద్ స్పష్టం చేశారు.

Updated Date - 2021-10-25T01:52:27+05:30 IST