స్వాతంత్ర్యోద్యమం లో తెలుగు కవుల పాత్ర అద్వితీయం

ABN , First Publish Date - 2021-08-03T23:31:57+05:30 IST

తెలుగు కవులు తమ రచనల ద్వారా ప్రజలలో దేశభక్తి స్ఫూర్తిని నింపి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనేలా చేయటంలో అధ్బుతమైన పాత్ర నిర్వహించారని దూరదర్శన్ లో అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ చేసిన రేవూరి అనంత పద్మనాభ రావు అన్నారు

స్వాతంత్ర్యోద్యమం లో తెలుగు కవుల పాత్ర అద్వితీయం

హైద‌రాబాద్‌: తెలుగు కవులు తమ రచనల ద్వారా  ప్రజలలో దేశభక్తి స్ఫూర్తిని నింపి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనేలా చేయటంలో అధ్బుతమైన పాత్ర నిర్వహించారని దూరదర్శన్  లో అడిషనల్ డైరెక్టర్  జనరల్ గా సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ చేసిన రేవూరి అనంత పద్మనాభ రావు అన్నారు. కేంద్ర సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో, పత్రికా సమాచార కార్యాలయం “ఆజాది కా అమృత్ మహోత్సవ్” లో భాగంగా  మంగళవారం ‘స్వాతంత్ర్యోద్యమం లో తెలుగు కవులు’  అనే అంశం పై నిర్వహించిన వెబినార్ లో ప్రధాన వక్తగా పాల్గొన్నారు.ఈ సంధర్భంగా ఆయన ప్రసంగిస్తూ  తెలుగు కవులు స్వాతంత్య్ర ఉద్యమానికి సబందించిన ఉజ్వల ఘట్టాల పైన, ఉద్యమానికి నాయకత్వం వహించిన  మహాత్మాగాంధీ, బాలగంగాధర్ తిలక్ ,బిపిన్ చంద్రపాల్ , లాలా లజపతీ రాయ్ లాంటి ఎందరో నాయకుల గురించి అనేక కవితలు,కావ్యాలు,పద్యాలు,గేయాలు,పుస్తకాలు రాసి ప్రజలలో స్వాతంత్ర స్ఫూర్తిని కలిగించారని అన్నారు. 


గురజాడ అప్పారావు, మంగిపూడి వెంకటరాయ శర్మ,తుమ్మల సీతారామమూర్తి  రాయప్రోలు సుబ్బారావు,గుర్రం జాషువా,చిలకమర్తి లక్ష్మీనరసింహం,పుట్టమర్తి నారాయాచార్యులు, చెరుకువాడ వెంకట రామయ్య,దువ్వూరి రామిరెడ్డి, ఉన్నవ లక్ష్మీ నారాయణ,కరుణశ్రీ, గరిమెళ్ల సత్యనారాయణ  తదితర 25కు పైగా కవులు అనేక రచనలు చేసి ప్రజలలో స్వాత్రంత్య కాంక్షను రగిలించడంతో పాటు స్వయంగా ఉద్యమంలో పాల్గొన్నారని వివరించారు. స్వాతంత్య్ర ఉద్యమం లో అసువులు బాసిన అమరవీరుల గురించి,అస్పృశ్యత లాంటి సాంఘిక దురాచారాల గురించి  రచనలు చేసి ప్రజలలో చైతన్య జ్వాలను రగిలించారని తెలిపారు. మన మువ్వన్నెల జెండా పై కూడా అనేక గేయాలు,పద్యాలు రూపంలో  ఆనాటి కవులు  రచనలు చేసి  దేశభక్తిని పెంపొందించారని తెలిపారు.  


దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తవుతున్న  తరుణంలో తమ రచనల ద్వారా ప్రజలను ఆనాడు ప్రభావితం చేసిన మహనీయులు గురించి నేటి తరం  తెలుసుకొని స్ఫూర్తి పొందాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అనంత  పద్మనాభ రావు అన్నారు. “దేశం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకునే అద్భుత అవకాశం మనకు లభించింది” అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్న మాటలను గుర్తు చేస్తూ , ఆజాదికా అమృత్ మహోత్సవాల  సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా ఈ వెబినార్ ను  ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్ (ఆర్.ఓ.బి, పి.ఐ.బి) శృతి పాటిల్, తన ప్రారంభోపన్యాసం లో తెలిపారు.

Updated Date - 2021-08-03T23:31:57+05:30 IST