జాతీయ రోయింగ్లో డోపింగ్ కలకలం
ABN , First Publish Date - 2020-06-24T06:34:52+05:30 IST
ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 22 మంది జాతీయ క్రీడాకారులు డోపింగ్లో పట్టుబడ్డారు. జూనియర్ స్థాయిలోని జాతీయ పురుషులు, మహిళల...
పరీక్షల్లో దొరికిన 22 మంది జూనియర్లు
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 22 మంది జాతీయ క్రీడాకారులు డోపింగ్లో పట్టుబడ్డారు. జూనియర్ స్థాయిలోని జాతీయ పురుషులు, మహిళల రోయర్లు డోప్ టెస్టులో విఽఫలమైనట్టు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. 16 నుంచి 18 ఏళ్లలోపు ఉన్న వీరంతా ఒకే నిషేధిత డ్రగ్ వాడినట్టు రుజువైంది. గతేడాది డిసెంబరులో థాయ్లాండ్లో జరిగిన ఆసియా జూనియర్ రోయింగ్ పోటీలకు ముందు భారత జట్లకు హైదరాబాద్లో శిబిరం ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా రోయర్లకు నిర్వహించిన డోప్ పరీక్షల్లో.. అందరి యూరిన్ శాంపిల్స్లోనూ ప్రోబ్నెసిడ్ అనే ఉత్ర్పేరకం తీసుకున్నట్టు తాజాగా బయటపడింది. శిబిరంలో పాల్గొన్న 24 మందిలో 20 మంది పట్టాయా టోర్నీకి వెళ్లి పతకాలు కూడా సాధించారు. రోయర్ల బి శాంపిల్స్ కూడా పాజిటివ్గా తేలితే.. వారిపై చర్యలు తీసుకునే అవకాశముంది.
ఆహార పదార్థాల వల్లేనా..?
డోపీలుగా పట్టుబడ్డ రోయర్లందరి శాంపిల్స్లో ఒకేరకమైన డ్రగ్ ఉండడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. వాళ్లు తీసుకున్న ఆహార పదార్థాల్లో ఈ డ్రగ్ కలిసి ఉండొచ్చన్న సందేహాలను భారత రోయింగ్ సమాఖ్య కార్యదర్శి ఎమ్వీ శ్రీరామ్ వ్యక్తం చేశాడు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నిజాలు రాబడతామని శ్రీరామ్ అన్నాడు.