ఐపీఎల్లో డోపింగ్ పరీక్షలు..
ABN , First Publish Date - 2020-08-14T08:51:05+05:30 IST
ఐపీఎల్లో డోపింగ్ పరీక్షల కోసం క్రికెటర్ల శాంపిళ్లను సేకరించేందుకు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) సన్నద్ధమవుతోంది. ఈ మేరకు యూఏఈకి చెందిన జాతీయ డోపింగ్ నిరోధక కమిటీ (ఎన్ఏడీఓ)తో ఓ అవగాహన కుదుర్చుకుంది...
న్యూఢిల్లీ: ఐపీఎల్లో డోపింగ్ పరీక్షల కోసం క్రికెటర్ల శాంపిళ్లను సేకరించేందుకు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) సన్నద్ధమవుతోంది. ఈ మేరకు యూఏఈకి చెందిన జాతీయ డోపింగ్ నిరోధక కమిటీ (ఎన్ఏడీఓ)తో ఓ అవగాహన కుదుర్చుకుంది. మెగా లీగ్ సందర్భంగా రెండు ఏజెన్సీలు సంయుక్తంగా ఆటగాళ్ల మూత్రపు శాంపిళ్లను సేకరించనున్నాయి.
వచ్చే నెల 19 నుంచి నవంబరు 10 వరకు యూఏఈలో ఐపీఎల్ను షెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే. కొవిడ్ ప్రొటోకాల్ను పాటిస్తూనే శాంపిళ్లను సేకరించనున్నారు. దుబాయ్ అధికారుల సాయంతో సేకరించిన నమూనాలను దోహాలోని ల్యాబ్లో పరీక్షించనున్నారు. గత పన్నెండేళ్లుగా స్వీడన్కు చెందిన ఏజెన్సీ.. బీసీసీఐ తరఫున డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తూ వస్తోంది. కానీ, భారత బోర్డు ఇప్పుడు నాడా పరిధిలోకి వచ్చింది.