‘నా కొడుకు పిరికివాడు కాదు.. కోడలే చంపి ఆత్మహత్య అని చెబుతోంది..’
ABN , First Publish Date - 2020-07-08T21:57:03+05:30 IST
పాల్వంచలోని కేటీపీఎస్లో గ్రేడ్ ఫోర్మెన్గా పనిచేస్తున్న అవునూరి ఫ్రాన్సిస్ (45) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కఽథనం..
కేటీపీఎస్ ఫోర్మెన్ అనుమానాస్పద మృతి
కోడలే హత్య చేసిందని మృతుడి తండ్రి ఫిర్యాదు
కేటీపీఎస్ /పాల్వంచ (ఖమ్మం): పాల్వంచలోని కేటీపీఎస్లో గ్రేడ్ ఫోర్మెన్గా పనిచేస్తున్న అవునూరి ఫ్రాన్సిస్ (45) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కొంతకాలంగా భార్య కవిత, ఫ్రాన్సిస్ ఘర్షణ పడుతున్నారు. సోమవారం అర్ధరాత్రి వరకూ ఘర్షణ జరిగిన అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంటానని పలు మార్లు హెచ్చరించిన ఫ్రాన్సిస్ కేటీపీఎస్ బీ కాలనీలోని క్వార్టర్లో భార్యా, పిల్ల లు నిద్రిస్తుండగా ఫ్రాన్సిస్ క్వార్టర్ ముందు ఉన్న షెడ్లో పడుకున్నాడు.
తెల్లవారుజామున భార్య కవిత లేచి చూడగా షెడ్లో చీరతో ఉరివేసుకొని కనిపించాడు. దీంతో చుట్టు పక్కల వారి సహకారంతో వైద్యశాలకు తరలించేలోగానే మృతిచెందాడు. 2002లో కవితను ప్రాన్సిస్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని భార్య కవితే ఫ్రాన్సిస్ను హత్య చేసిందని మృతుడి తండ్రి రాయలింగు పాల్వంచ పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసును అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. పట్టణ ఎస్ఐ ప్రవీణ్ దర్యాప్తు చేస్తున్నారు.