‘గంటా’పై అనుమానాలు!

ABN , First Publish Date - 2021-03-04T22:11:21+05:30 IST

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరికపై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

‘గంటా’పై అనుమానాలు!

విశాఖ: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరికపై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. గంటా అనుచరుడు కాశీ విశ్వనాథ్ వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా విజయసాయి మాట్లాడుతూ టీడీపీ నుంచి మరికొందరు వైసీపీలో చేరుతారని బాంబు పేల్చారు. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి పనులతో అందరూ వైసీపీ వైపు ముగ్గు చూపుతున్నారని చెప్పారు. గతంలో గంటా కొన్ని ప్రతిపాదనలు పంపారని, తమ పార్టీలోని నేతలందరూ ఆమోదిస్తే ఆయనను వైసీపీలో చేర్చుకుంటామని తెలిపారు. 


అయితే విజయసాయి వ్యాఖ్యలను గంటా శ్రీనివాసరావు ఖండించారు. తాను పార్టీ మారుతున్నట్లు చాలాసార్లు ప్రచారం జరిగిందని, దాన్ని ఇప్పటి ఖండిస్తూనే ఉన్నానని తెలిపారు. విజయసాయిరెడ్డి ప్రకటనను మైండ్‌గేమ్‌గా గంటా శ్రీనివాసరావు అభివర్ణించారు. ఐదు రోజుల్లో విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికలు జరగనున్న సమయంలో విజయసాయిరెడ్డి ఇలా ప్రకటించడం మైండ్‌గేమేనని విలేకరులతో అన్నారు. 2021 ప్రారంభం నుంచి టీడీపీలో యాక్టివ్‌గా ఉన్నానని, జీవీఎంసీ ఎన్నికలకు కార్పొరేటర్‌ అభ్యర్థులను ఎంపిక చేశానని, వార్డుల్లో ప్రచారం కూడా చేపట్టామని తెలిపారు. 2019 ఎన్నికల ముందు, ఆ తరువాత కూడా తాను పార్టీ మారతానని పుకార్లు వచ్చాయని వివరించారు. జగన్‌ పరిశీలనలోని ఆ ప్రతిపాదనలు ఏమిటో విజయసాయిరెడ్డినే అడగాలన్నారు. తాజాగా వైసీపీలో చేరిన కాశీ విశ్వనాథం తనకు ముఖ్యమైన అనుచరుడేనని, రెండేళ్లుగా చాలా ఇబ్బందులు పడుతున్నాడని, అనుమతులున్నా ఆయన గోకార్టింగ్‌ను కూల్చేశారని గుర్తుచేశారు. 


గంటా స్పందనపై విజయసాయి కౌంటరిచ్చారు. మైండ్‌గేమ్‌ ఆడాల్సిన అవసరం  తమ పార్టీకి లేదని, విజయసాయి చెప్పారు. వైసీపీలోకి గంటా వచ్చినంత మాత్రానా.. లేదా రానన్న మాత్రనా ప్రభుత్వంలో ఎలాంటి మార్పులు ఉండవని తెలిపారు. అయితే వైసీపీలో గంటా చేరికపై కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. మంత్రి అవంతి శ్రీనివాస్ కారణంగా అది ఆలస్యమవుతోందనే వార్తలు వచ్చాయి. అవంతిని బుజ్జగించే ప్రయత్నాలు కూడా జరిగాయనే ప్రచారం కూడా ఉంది. ఆ తర్వాత కొంతకాలం ఈ విషయంపై చర్చ జరుగలేదు. తాజాగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విజయసాయి వ్యాఖ్యలు విశాఖ రాజకీయాల్లో మరింత వేడిని పెంచాయి. 


విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటైజేషన్‌కు సంబంధించి కేంద్రం నిర్ణయం అమలులోకి రాగానే తన రాజీనామాను ఆమోదించాలని అసెంబ్లీ స్పీకర్‌ను గంటా కోరారు. ప్రస్తుతం రాజీనామా లేఖ స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉంది. గత కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న గంటా.. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖకు వచ్చినప్పుడు ఆయన వెంట ఉన్నారు. టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు దీక్షకు కూర్చున్నప్పుడు శిబిరం వద్దకు వచ్చి మద్దతు తెలిపారు. దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో చంద్రబాబుతో కలిసి ఆసుపత్రిలో పల్లాను గంటా పరామర్శించారు. అయితే తాను పార్టీ మారుతున్నట్లు ఇప్పటివరకు ఆయన ప్రకటించలేదు. మున్సిపల్ ఎన్నికల వేళ గంటా పార్టీ మారుతారంటూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తుండడం తమ శ్రేణులు మనోధైర్యాన్ని దెబ్బతీయానికేనని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు.    

Updated Date - 2021-03-04T22:11:21+05:30 IST