నూతన టెక్నాలజీతో డీపీవో భవనం
ABN , First Publish Date - 2020-07-03T10:18:57+05:30 IST
ఆధునిక హంగులతో జిల్లా పోలీసు అధికారుల కార్యాలయ భవన నిర్మాణం చేపడుతున్నట్లు డిప్యూటీ సీఎం అంజద్బాషా తెలిపారు.
భూమి పూజ చేసిన డిప్యూటీ సీఎం, ఎంపీ, ఎమ్మెల్యే
కడప (క్రైం), జూలై 2: ఆధునిక హంగులతో జిల్లా పోలీసు అధికారుల కార్యాలయ భవన నిర్మాణం చేపడుతున్నట్లు డిప్యూటీ సీఎం అంజద్బాషా తెలిపారు. నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణంలో నూతన డీపీవో కార్యాలయ భవన నిర్మాణానికి గురువారం భూమి పూజ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం అంజద్బాషా, ఎంపీ వైఎస్ అవినా్షరెడ్డి, ఎమ్మెల్యే పి.రవీంద్రనాధరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ డీపీవో కార్యాలయం పాతబడిపోవడంతో ప్రజలకు ఇబ్బందిగా ఉందని, నూతనంగా డీపీవో భవనం నిర్మించాలని సీఎం జగన్ దృష్టికి తీసుకుపోవడంతో ఆయన స్పందించి రూ.18 కోట్లతో భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఏడాదిలోపే భవనం పూర్తవుతుందని, రాష్ట్రంలో తిరుపతి తరువాత అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఈ డీపీవో కార్యాలయ భవన సముదాయాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. కడప నగరం సుందరీకరణలో భాగంగా రోడ్లు బ్యూటిఫికేషన్, పాతకడప చెరువును ట్యాంక్బండ్ తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. రాబోవు రోజుల్లో కడప నగర రూపురేఖలు మార్చి సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎంపీ అవినా్షరెడ్డి మాట్లాడుతూ కడప నగరాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించామన్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో పాటు క్యాన్సర్ హాస్పిటల్, ఎల్వీ ప్రసాద్ ఐకేర్ ఇనిస్టిట్యూట్, నగరంలో రోడ్లు బ్యూటిఫికేషన్కు అంచనాలు తయారు చేశామన్నారు. త్వరలో వీటిని కూడా పూర్తి చేస్తామన్నారు.
కొప్పర్తి పారిశ్రామికవాడకు సోమశిల బ్యాక్వాటర్ను పైపులైను ద్వారా కొప్పర్తి ప్రాంతానికి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి, ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ మాట్లాడారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, ఏఆర్ ఏఎస్పీ రుషికేశ్వర్రెడ్డి, ఏఆర్ డీఎస్పీ రమణయ్య, డీఎస్పీ సూర్యనారాయణ, ఎస్బీ డీఎస్పీ వంశీధర్, వన్టౌన్ సీఐ సత్యనారాయణ, చిన్నచౌకు సీఐ అశోక్రెడ్డి, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సురేష్, యోగయ్య, వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.