రాష్ర్టాభివృద్ధిలో చెరగని ముద్ర డాక్టర్ కోడెల
ABN , First Publish Date - 2021-09-17T13:54:46+05:30 IST
డాక్టర్ కోడెల శివప్రసాద్ ద్వితీయ వర్ధంతి కార్యక్రమాన్ని..
వినుకొండ: డాక్టర్ కోడెల శివప్రసాద్ ద్వితీయ వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక టీడీపీ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి నరసరావుపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ కోడెల శివప్రసాద్ వర్ధంతి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మండలాల్లో, గ్రామాల్లో పెద్దఎత్తున నిర్వహిస్తున్నారన్నారు. డాక్టర్ కోడెల శివప్రసాద్ ఈ రాష్ర్టాభివృద్ధిలో భాగం పంచుకున్నారని, హోంమంత్రిగా, ఆరోగ్యశాఖ మంత్రిగా, ఇరిగేషన్ శాఖ, పంచాయతీ శాఖ మంత్రిగా, అనేక శాఖల్లో మంత్రి పదవి నిర్వహించి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారన్నారు. పల్నాడు ప్రాంత అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి తొలిస్పీకర్గా ఎన్నో సేవలు అందించారన్నారు. వైసీపీ ప్రభుత్వం కేవలం కక్షసాధింపు చర్యల్లో భాగంగా తప్పుడు కేసులు బనాయించి ఎన్నో వేధింపులకు గురి చేసినందు వల్ల మానసిక క్షోభకు గురయ్యారని, ఎన్నో ఇబ్బందులు పెట్టి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రభుత్వం కారణమైందన్నారు. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన ఆశయసాధన కోసం యువత నడుంబిగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని కోడెలకు నివాళులర్పించారు.