మేజిస్ట్రేట్కు డా. సుధాకర్ వాంగ్మూలం.. షాకింగ్ విషయాలు!
ABN , First Publish Date - 2020-05-24T05:19:27+05:30 IST
విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ వైద్యకేంద్రంలో అనస్థీషియా నిపుణుడిగా పనిచేసిన డాక్టర్ సుధాకర్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం విదితమే.
అమరావతి : విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ వైద్యకేంద్రంలో అనస్థీషియా నిపుణుడిగా పనిచేసిన డాక్టర్ సుధాకర్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం విదితమే. ఈ కేసులో శనివారం రాత్రి మేజిస్ట్రేట్ ముందు డాక్టర్ సుధాకర్ వాంగ్మూలం ఇచ్చారు. ఎన్-95 మాస్కుల కోసం ముందు నర్సీపట్నం ఎమ్మెల్యే వద్దకెళ్లానన్నారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో అయ్యన్నవద్దకు వెళ్లానని మేజిస్ట్రేట్కు ఆయన తెలిపారు. అదే విధంగా మాస్కుల గురించి అడిగితే అధికారులంతా తనను దూషించారని సుధాకర్ వివరించారు.
వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు..!
‘అధికారులు దూషించే సమయంలో అక్కడే ఉన్న మీడియావాళ్లు అడిగితే జరిగిన విషయం చెప్పాను. ఏప్రిల్-08న నన్ను సస్పెండ్ చేశారు. సస్పెండ్ ఆదేశాలు ఉదయం 5 గంటలకు అంబులెన్స్ డ్రైవర్ తెచ్చిచ్చాడు. రెండు రోజులకే స్కోడా కారులో వచ్చినవాళ్లు మా అబ్బాయి బైక్ తీసుకెళ్లారు. విషయం తెలుసుకునేందుకు పోలీస్ స్టేషన్కెళ్తే మహిళా కానిస్టేబుల్ నా చేతులు పట్టుకుని వదలండి అంటూ కేకలేసింది. పోలీసుంతా నన్ను కొట్టారు’ అని మేజిస్ట్రేట్కు డాక్టర్ షాకింగ్ విషయాలు వివరించారు.
బ్యాంక్కు వెళ్తుండగా.. !
‘ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసేలా తప్పుడు కేసు నమోదు చేస్తామని బెదిరించారు. బ్యాంకులో డబ్బులేసేందుకు వెళ్తుంటే ఎవరో ఫాలో అవుతున్నట్లు గమనించాను. ఆగితే కానిస్టేబుళ్లు వచ్చి నా సస్పెన్షన్ గురించి అడిగారు. నా కారులోవున్న రూ.10 లక్షలు తీసుకున్నారు.. మందుబాటిళ్లు పెట్టారు. నన్ను తాగుబోతులా, పిచ్చోడిలా చిత్రీకరించేందుకు యత్నించారు. పీఎస్ నుంచి కేజీహెచ్కు అక్కడి నుంచి మెంటల్ ఆస్పత్రికి తరలించారు’ అని మేజిస్ట్రేట్కు సుధాకర్ నిశితంగా వివరించారు. అయితే ఈ వాంగ్మూలం తీసుకున్న తర్వాత మేజిస్ట్రేట్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారనే దానిపై అందరిలోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది.