కొవిడ్‌ నిబంధనల మేరకు వ్యాపారాలు సాగించాలి

ABN , First Publish Date - 2020-10-25T10:33:39+05:30 IST

కొవిడ్‌ రెండో దశ ప్రారంభమైనందున హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌మాల్స్‌ యజమానులు కొవిడ్‌ నియమావళిని శతశాతం అనుసరిస్తూ వ్యాపారాలు సాగించాలని జీవీఎంసీ అదనపు కమిషనర్‌ డాక్టర్‌ ..

కొవిడ్‌ నిబంధనల మేరకు వ్యాపారాలు సాగించాలి

జీవీఎంసీ అదనపు కమిషనర్‌ డాక్టర్‌ వి.సన్యాసిరావు


విశాఖపట్నం, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ రెండో దశ ప్రారంభమైనందున  హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌మాల్స్‌ యజమానులు కొవిడ్‌ నియమావళిని శతశాతం అనుసరిస్తూ వ్యాపారాలు సాగించాలని జీవీఎంసీ అదనపు కమిషనర్‌ డాక్టర్‌ వి.సన్యాసిరావు కోరారు. జీవీఎంసీ సమావేశ మందిరంలో హోటళ్లు, రెస్టారెంట్‌లు, షాపింగ్‌మాల్స్‌ యజమానుల ప్రతినిధులతో శనివారం ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌-19 నిబంధనలపై ఈ నెల 30 వరకూ అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించిందన్నారు.


ఈ నేపథ్యంలో వ్యాపారులు తమ వ్యాపార ప్రాంగణంలో ప్రతీ ఒక్కరూ మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించడంతోపాటు సామాజిక దూరం అమలుచేయాలని సూచించారు. అలాగే హోటల్‌కు లేదా దుకాణానికి వచ్చే వినియోగదారులకు థర్మల్‌స్కానింగ్‌ చేయాలని, ప్రధాన ద్వారం వద్ద శానిటైజర్‌ అందుబాటులో ఉంచడంతోపాటు కొవిడ్‌ నియమావళి తెలిసేలా బ్యానర్లు పెట్టాలని సూచించారు. హోటళ్లు, లాడ్జిలకు వచ్చే వినియోగదారుల లగేజ్‌ను కూడా శానిటైజ్‌ చేయాలని, గదులను హైపో క్లోరైట్‌తో శుభ్రపరచాలని సూచించారు. ఈ సమావేశంలో జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ కేఎస్‌ఎల్‌జీ శాస్త్రి, ఏఎంహెచ్‌ఓ డాక్టర్‌ జయరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-25T10:33:39+05:30 IST