మరో ఘన విజయం సాధించిన డీఆర్డీవో
ABN , First Publish Date - 2020-09-23T21:45:24+05:30 IST
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) సాధించిన విజయం భారత దేశ భద్రతా దళాలను మరింత శక్తిమంతం చేసింది. మెయిన్ బ్యాటిల్ ట్యాంక్
న్యూఢిల్లీ : రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) సాధించిన విజయం భారత దేశ భద్రతా దళాలను మరింత శక్తిమంతం చేసింది. మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ (ఎంబీటీ) అర్జున్ నుంచి లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ను విజయవంతంగా పరీక్షించింది.
అహ్మద్నగర్లోని కేకే రేంజస్లో బుధవారం ఈ ప్రయోగం జరిగింది. భారత సైన్యానికి చెందిన ఆర్మర్డ్ కార్ప్స్ సెంటర్ అండ్ స్కూల్ ఇక్కడే ఉంది.
డీఆర్డీవో విడుదల చేసిన ప్రకటనలో, లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ను విజయవంతంగా పరీక్షించినట్లు తెలిపింది. 3 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించినట్లు తెలిపింది.
ఈ మిసైల్ టాండెమ్ హై ఎక్స్ప్లొజివ్ యాంటీ ట్యాంక్ వార్హెడ్ను తీసుకెళ్ళిందని, ఎక్స్ప్లొజివ్ రియాక్టివ్ ఆర్మర్ రక్షణగల సాయుధ వాహనాలను దెబ్బతీసినట్లు పేర్కొంది. విభిన్న వేదికల నుంచి ప్రయోగించేందుకు అనువుగా దీనిని రూపొందించినట్లు పేర్కొంది. ఎంబీటీ అర్జున్ గన్ నుంచి ప్రయోగించేందుకు సాంకేతికపరమైన మూల్యాంకన జరుగుతున్నట్లు తెలిపింది.
ఆధునిక, భావి శత్రు యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయడం కోసం దీనిని అభివృద్ధిపరచినట్లు పేర్కొంది. పుణేలోని ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ దీనిని కెనన్ లాంచ్డ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ క్రింద అభివృద్ధి చేసిందని తెలిపింది.
తక్కువ ఎత్తులో ప్రయాణించే హెలికాప్టర్లను కూడా ఈ క్షిపణి ధ్వంసం చేయగలదని వివరించింది.