మురుగుతో ముప్పు!
ABN , First Publish Date - 2021-05-08T06:05:04+05:30 IST
మురుగుతో ముప్పు!
ఫవెదజల్లుతున్న దుర్వాసన
ఫవిజృంభిస్తున్న దోమలు
ఫ వ్యాధులబారిన కాలనీ వాసులు
భారతీనగర్, మే 7 : కనకదుర్గానగర్, కామినేని నగర్ ప్రాంతాల్లోని పంటకాలువలో మురుగు ప్రవహించక పోవడంతో దుర్వాసనతో పాటు విజృంభిస్తున్న దోమలతో ఈ ప్రాంతవాసులు ఇబ్బందిపడుతున్నారు. ఈ రెండు కాలనీ లకు ఒక పక్క పంటకాలువ మరోవైపు గుంటతిప్ప డ్రెయిన్లు ఉన్నాయి. ఇవి రెండు మురుగునీటి కాలువలు. వీటిలో పంట కాలువ పడమట ప్రాంతంలో ప్రారంభమై గురునానక్ కాలనీ మీదుగా శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీ, శ్రీరామ చంద్రనగర్ కాలనీ, కరెన్సీ నగర్ ప్రాంతాల్లోని వాడకం నీరు మొత్తం ఈ కాలువలో కలుస్తుంది. ఇదీ కనకదుర్గ నగర్ కాలనీ సమీపంలోని గుంటతిప్ప డ్రెయిన్లో కలుస్తుంది. ప్రస్తుతం ఈ రెండు మురుగునీటి కాలువల్లో వీఎంసీ సిబ్బంది పూడిక పనులు చేపట్టకపోవటంతో పలు చోట్ల చెత్త ఇతర వ్యర్థాలతో పేరుకు పోయింది. దీంతో రోజుల తరబడి మురుగు ప్రవహించకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. వేసవిలో సైతం డ్రెయిన్లు అనేక ప్రాంతాల్లో పొంగు తున్నాయి. వర్షాకాలం రోడ్లపైనే మురుగు ప్రవహిస్తోంది. పూడిక పనులు చేపట్టాలని ఈ ప్రాంతవాసులు అనేక సార్లు వీఎంసీ అధికారులకు మొరపెట్టుకున్నా స్పందించటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమలు రాత్రి పగలు అనే తేడా లేకుండా విజృంభిస్తున్నా యని పగలు ఇళ్లలో చేరుతున్నాయని వాపోతున్నారు. దోమకాటుతో తరచూ వ్యాధులబారిన పడుతున్నామంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వర్షాలు పడకు ముందే డ్రెయిన్లలో పూడిక పనులు చేపట్టాలని కోరుతున్నారు.