సమస్యలకు.. ‘విడిది’!

ABN , First Publish Date - 2021-08-31T05:46:34+05:30 IST

టెక్కలి మండలం తేలినీలాపురం.. విదేశీ పక్షుల విడిది కేంద్రంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. అటవీ శాఖ పర్యవేక్షణలో కొనసాగుతున్న ఈ కేంద్రం.. కొన్నేళ్లుగా సమస్యలకు విడిదిగా మారింది. కనీస సౌకర్యాలు లేక పర్యాటకులను నిరాశకు గురిచేస్తోంది. సైబీరియా ప్రాంతం నుంచి ఏటా సెప్టెంబరులో పెలికాన్‌, పెయింటెడ్‌స్టాక్స్‌ పక్షులు ఇక్కడి విడిది కేంద్రానికి విచ్చేస్తాయి.

సమస్యలకు.. ‘విడిది’!
తేలినీలాపురం విదేశీపక్షుల విడిది కేంద్రం




- విదేశీపక్షుల కేంద్రంలో కనీస వసతులు కరువు

- తేలినీలాపురంలో పర్యాటకులకు ఇబ్బందులు

(టెక్కలి రూరల్‌)

టెక్కలి మండలం తేలినీలాపురం.. విదేశీ పక్షుల విడిది కేంద్రంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. అటవీ శాఖ పర్యవేక్షణలో కొనసాగుతున్న ఈ కేంద్రం.. కొన్నేళ్లుగా సమస్యలకు విడిదిగా మారింది. కనీస సౌకర్యాలు లేక పర్యాటకులను నిరాశకు గురిచేస్తోంది. సైబీరియా ప్రాంతం నుంచి ఏటా సెప్టెంబరులో పెలికాన్‌, పెయింటెడ్‌స్టాక్స్‌ పక్షులు ఇక్కడి విడిది కేంద్రానికి విచ్చేస్తాయి. వీటిని చూసేందుకు మన రాష్ట్రంతో పాటు ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి  వందలాది మంది పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ తాగునీరు, మరుగుదొడ్లు తదితర కనీస వసతులు లేకపోవడంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి వనరులు ఉన్నా.. వినియోగంలోకి తీసుకురావడంలో అధికారులు విఫలమవుతున్నారు. తితలీ తుఫాన్‌ సమయంలో ఇక్కడ అనేక చెట్లు నేలకొరిగాయి. పక్షుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక టవర్లు, నెట్‌లు దెబ్బతిన్నాయి. ఇప్పటికీ అధికారులు వాటిని సరిచేయడం లేదు. చిన్నారుల ఆట పరికరాలు మూలకు చేరాయి. దీంతో పర్యాటకులకు ఆహ్లాదం కరువవుతోంది. ఇటీవల వివిధ అభివృద్ధి పనులు చేపట్టగా.. నాణ్యతా లోపం కనిపిస్తోంది. అతిథిగృహం, మరుగుదొడ్ల ఆధునికీకరణలో పైపై మెరుగులతో సరిపెట్టారు. లోపలి భాగాల్లో అసంపూర్తిగా పనులు వదిలేశారు. పక్షులను అతి దగ్గర నుంచి చూసేందుకు రెండు దశాబ్దాల కిందట నిర్మించిన వాచ్‌టవర్‌ శిథిలావస్థకు చేరుకుంది. విడిది కేంద్రంలో డ్రైనేజీ సదుపాయం లేక.. వరదనీరు తమ ఇళ్లల్లోకి చేరుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. విదేశీపక్షుల విడిది కేంద్రంలో సమస్యలు పరిష్కరించాలని పర్యాటకులు కోరుతున్నారు. 





Updated Date - 2021-08-31T05:46:34+05:30 IST