డ్రగ్స్ కట్టడికి పటిష్ఠ వ్యూహం
ABN , First Publish Date - 2021-10-19T07:12:04+05:30 IST
రాష్ట్రంలో మాదకద్రవ్యాలను అరికట్టేందుకు పటిష్ఠమైన వ్యూహాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
- రేపు సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం
- 23న పోడు భూములపై ముఖ్యమంత్రి సమీక్ష
హైదరాబాద్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మాదకద్రవ్యాలను అరికట్టేందుకు పటిష్ఠమైన వ్యూహాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు పోలీస్, ఎక్సైజ్శాఖ ఉన్నతాధికారులతో బుధవారం ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా డ్రగ్స్ మాఫియా పెచ్చుమీరుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వాటిని నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. తమ జిల్లాల పరిధిలో నెలకొన్న పరిస్థితులు, డ్రగ్స్ నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదికలతో సమావేశానికి రావాలని ఎక్సైజ్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివా్సగౌడ్, సీఎస్ సోమేశ్కుమార్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా, డీజీపీ మహేందర్ రెడ్డి, అదనపు డీజీపీ(శాంతిభద్రతలు) జితేందర్ తదితరులు పాల్గొననున్నారు. ఇక పోడు భూములు, అడవుల పరిరక్షణ, హరితహారం ఎజెండాగా ఈ నెల 23న ఆ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసీలు, గిరిజనుల సమస్యలను సానుభూతితో పరిష్కరించడంతోపాటు అడవి తరిగిపోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించనున్నారు.
ఈ సమావేశంలో అటవీశాఖ, గిరిజన సంక్షేమశాఖ, పంచాయతీరాజ్ శాఖల మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, ఆయా శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా కన్జర్వేటర్లు, డీఎ్ఫవోలు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి సమావేశం నేపథ్యంలో పోడు సమస్యపై అధ్యయనం చేసేందుకు, వాస్తవాలను తెలుసుకునేందుకు అధికారుల బృందం ఈ నెల 20, 21, 22 తేదీల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించనుంది. అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ ఛోంగ్తు, పీసీసీసీఎఫ్ ఆర్.శోభతో కూడిన ఈ బృందం హెలికాప్టర్ ద్వారా అటవీ ప్రాంతాలను పరిశీలించనున్నారు.