అబుధాబి లాటరీలో జాక్పాట్ కొట్టిన భారతీయుడు..!
ABN , First Publish Date - 2020-08-04T14:59:15+05:30 IST
దుబాయిలో ఉండే భారత సంతతి వ్యక్తి అబుధాబి బిగ్టికెట్ రాఫెల్లో జాక్పాట్ కొట్టాడు.
అబుధాబి: దుబాయిలో ఉండే భారత సంతతి వ్యక్తి అబుధాబి బిగ్టికెట్ రాఫెల్లో జాక్పాట్ కొట్టాడు. ఏకంగా 12 మిలియన్ దిర్హామ్స్(సుమారు రూ.24కోట్లు) గెలుచుకున్నాడు. అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం తీసిన అబుధాబి బిగ్టికెట్ డ్రాలో బెంగాల్కు చెందిన దీపాంకర్ డే ఈ భారీ మొత్తాన్ని గెలుచుకున్నాడు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రస్తుతం భార్య స్వాతి డే, కూతురు తనిస్తాలతో కలిసి బెంగాల్లోనే ఉంటున్న దీపాంకర్... జూలై 14న ఆన్లైన్లో మరి కొంతమంది స్నేహితులతో కలిసి నెం. 041486 గల లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. ఈ టికెటే ఇప్పడు అతనికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. దీంతో దీపాంకర్ ఆనందానికి అవధుల్లేవు.
ఇక బిగ్టికెట్ రాఫెల్ ఆర్గనైజర్ రిచర్డ్ తనకు లాటరీ గెలిచినట్టు ఫోన్ చేసిన సమయంలో తాను వంటగదిలో బిజీగా ఉన్నానని దీపాంకర్ తెలిపాడు. 2018 నుంచి బిగ్టికెట్ రాఫెల్లో 11 మంది స్నేహితులం కలిసి లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నామని, ఎప్పుడో ఒకసారి తాము లాటరీ గెలిచి తీరుతామని నమ్మేవాళ్లమని అన్నాడు. అది ఈ రోజు నిజమైందని ఆనందం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం గెలిచిన ఈ భారీ మొత్తాన్ని అందరం సమానంగా పంచుకుంటామన్నాడు.