దుబ్బాక ఉపఎన్నిక.. అభ్యర్థులందరి దృష్టి వారిపైనే..!

ABN , First Publish Date - 2020-10-28T18:21:31+05:30 IST

ఆ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే ఎక్కువ. కానీ ఇప్పటివరకు మహిళా ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహించలేదు. ఈ ప్రాంతం నుంచి ఎన్నికై చట్టసభల్లో గొంతుక వినిపించలేదు. 1957 నుంచి ఈ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహిస్తున్నప్పటికీ.. మహిళా అభ్యర్థి పోటీచేసిన దాఖలాలు లేవు.

దుబ్బాక ఉపఎన్నిక.. అభ్యర్థులందరి దృష్టి వారిపైనే..!

ఆ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే ఎక్కువ. కానీ ఇప్పటివరకు మహిళా ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహించలేదు. ఈ ప్రాంతం నుంచి ఎన్నికై చట్టసభల్లో గొంతుక వినిపించలేదు. 1957 నుంచి ఈ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహిస్తున్నప్పటికీ.. మహిళా అభ్యర్థి పోటీచేసిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు సీన్‌ మారిపోయింది. తొలిసారిగా ఇద్దరు మహిళలు పోటీ చేస్తున్నారు. వీరితో పాటు మరో 22 మంది పురుష అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరందరి దృష్టి ఇప్పుడు ఉమెన్ ఓట్లపైనే? ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఏమిటా కథ? ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. 


బీజేపీ ప్రచారం.. హరీష్ సవాలు..

దుబ్బాక ఉప ఎన్నికలో మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కుస్తీ పడుతున్నాయి. బీడీ కార్మికులుగా పనిచేస్తున్న అబలల ఓట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు అధికార టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడుతున్నారు. టిఆర్ఎస్ ప్రచారానికి నాయకత్వం వహించిన రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ఇటీవల ర్యాలీలో మహిళా బీడీ కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణలో బీడీ కార్మికులకు ఇచ్చే 2 వేల పింఛనులో 1,600 ప్రధాని మోడీ ఇస్తున్నారని బీజేపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని హరీశ్ రావు ఫైర్‌ అయ్యారు. బీడీ కార్మికులకు ఇచ్చే పింఛనులో 16 పైసలు కూడా ప్రధాని ఇవ్వట్లేదన్నారు. మోడీ డబ్బులు ఇస్తున్నట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వట్లేదని హరీశ్ రావు విరుచుకుపడ్డారు. 


మహిళా ఓటర్లే ఎక్కువ..

మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మహిళా నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మహిళా ఓటర్లపై దృష్టిసారించడానికి కారణం ఏమిటంటే.. దుబ్బాక నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ. మొత్తం 1,98,807 మంది ఓటర్లలో 1,00,779 మంది స్త్రీలు ఉండగా..98,026 మంది పురుషులు ఉన్నారు. నియోజకవర్గంలో దుబ్బాక, మిర్‌దొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయ్‌పోల్, చేగుంట, నర్సింగి, గజ్వేల్ మండలాల్లో మహిళా ఓటర్లు పురుషుల కన్నా అధికంగా ఉన్నారు. ఉదాహరణకు దుబ్బాక మండలంలో 55,208 మంది ఓటర్లలో 27,983 మంది స్త్రీలు, 27,725 మంది పురుషులు ఉన్నారు. 


రంగంలోకి మహిళా నాయకురాళ్లు..

ఇక టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత గెలుపు కోసం మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ప్రచారం చేస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడిన సోలిపేట రామలింగారెడ్డి ఆశయాలను కొనసాగిస్తానని సోలిపేట సుజాత అంటున్నారు. తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానంటున్నారు. బీజేపీ అభ్యర్థి ఎం. రఘునందన్ రావు కోసం ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఇతర మహిళా నాయకురాళ్లు ముమ్మరంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. కేసీఆర్‌ సర్కార్‌ వైఫల్యాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. దుబ్బాక అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చేసేందేమి లేదని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా ఆ పార్టీకి చెందిన ఒకే ఒక్క మహిళా ఎమ్మెల్యే సీతక్క దుబ్బాక నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపే స్వయం సహాయక బృంద మహిళలతో మాట్లాడటానికి అన్ని పార్టీలు మహిళా నాయకురాళ్లను నియమించాయి. తమ పార్టీ అభ్యర్థులకు వారి మద్దతు కోరుతూ స్వయం సహాయక సంఘం మహిళా లీడర్లతో క్రమం తప్పకుండా సమావేశమవుతున్నారు. 


మహిళలు పోటీ చేయడం తొలిసారి..

మరోవైపు ఉన్న తక్కువ సమయాన్ని వినియోగించుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు. స్థానిక మహిళా సర్పంచ్‌లు, మండల పరిషత్ నాయకురాళ్లు తమ పార్టీల అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇద్దరు మహిళలు ఈ ఎన్నికలో పోటీ చేయడం ఇదే మొదటిసారి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఉన్న దొమ్మాట నియోజకవర్గంలో మహిళా అభ్యర్థులు లేరు. ఈసారి టీఆర్‌ఎస్‌ నుంచి సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతతో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా టీవీ యాంకర్ కె.కార్తిక పోటీ చేస్తున్నారు. మరి మహిళా ఓటర్లు ఏ పార్టీకి మద్దతుగా నిలబడుతారు? ఏ పార్టీని తిరస్కరిస్తారు అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Updated Date - 2020-10-28T18:21:31+05:30 IST