మల్లంపేట్‎లో దొంగల బీభత్సం

ABN , First Publish Date - 2021-01-11T13:40:00+05:30 IST

నగర శివారులోని మల్లంపేట్‌లో ఆదివారం తెల్లవారుజామున దోపిడీ దొంగలు విజృంభించారు. నూతనంగా నిర్మిస్తున్న గృహ సముదాయం వద్ద కాపలాదారులను బంధించారు. మారణాయుధాలతో ...

మల్లంపేట్‎లో దొంగల బీభత్సం

మారణాయుధాలతో చొరబడి హల్‌చల్‌

కాపలాదారులను కొట్టి రూ. 20 లక్షల విలువైన కేబుల్స్‌ చోరీ


దుండిగల్: నగర శివారులోని మల్లంపేట్‌లో ఆదివారం తెల్లవారుజామున దోపిడీ దొంగలు విజృంభించారు. నూతనంగా నిర్మిస్తున్న గృహ సముదాయం వద్ద కాపలాదారులను బంధించారు. మారణాయుధాలతో బెదిరించారు. తీవ్రంగా కొట్టారు. సుమారు 20 లక్షల రూపాయల విలువచేసే కేబుల్‌వైర్లను దొంగిలించుకుపోయారు. దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన కలవరం సృష్టిస్తోంది.


మల్లంపేట్‌లో ‘సాయిప్రణీత’ పేరుతో గృహ సముదాయాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆరుగురు దోపిడీ దొంగలు మారణాయుధాలతో వెంచర్‌లోకి వచ్చారు. అక్కడున్న ముగ్గురు కాపలాదారులను బూట్ల లేసులతో బంధించి కొట్టారు. దాదాపు 20 లక్షల రూపాయల విలువ చేసే కేబుల్‌ను, ఇతర వస్తువులను దొంగిలించుకుపోయారు. వెంచర్‌ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదుతో దుండిగల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగలు గోడలు దూకి లోపలికి వచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాపలాదారులను విచారిస్తున్నారు. వెంచర్‌లో దోపిడీ విషయం తెలియడంతో చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు తీవ్రంగా భయపడుతున్నారు. సంఘటనా స్థలాన్ని బాలానగర్‌ డీసీపీ పద్మజ పరిశీలించారు. అక్కడ దోపిడీ జరిగిన తీరును తెలుసుకున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు  చేసి దోపిడీ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


Updated Date - 2021-01-11T13:40:00+05:30 IST