దుర్గాపూజ: వ్యాక్సినేటెడ్ భక్తులకు శుభవార్త

ABN , First Publish Date - 2021-10-07T21:56:31+05:30 IST

కోవిడ్-19 టీకాలు తీసుకున్నవారు దుర్గా పూజల సందర్భంగా

దుర్గాపూజ: వ్యాక్సినేటెడ్ భక్తులకు శుభవార్త

కోల్‌కతా : కోవిడ్-19 టీకాలు తీసుకున్నవారు దుర్గా పూజల సందర్భంగా పుష్పాంజలి, సిందూర్ ఖేలాలలో పాల్గొనవచ్చునని కలకత్తా హైకోర్టు తెలిపింది. భారీ స్థాయిలో దుర్గా పూజలు నిర్వహించే పందిళ్ళలో 45-60 మంది, చిన్న పందిళ్ళలో 10-15 మంది మాత్రమే పాల్గొనాలని తెలిపింది. సందర్శకులపై గత ఏడాది విధించిన అన్ని ఆంక్షలు ఈ ఏడాది కూడా కొనసాగుతాయని పేర్కొంది. 


దుర్గా పూజ పందిళ్ళలోనికి సందర్శకుల ప్రవేశంపై నిషేధం కొనసాగుతుందని హైకోర్టు తెలిపింది. పందిళ్ళ బయట తప్పనిసరిగా బారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ పందిళ్ళలో ప్రవేశించే పూజా కమిటీల సభ్యుల సంఖ్యపై పరిమితి విధించింది. సందర్శకులపై నిషేధం విధిస్తూ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి అభ్యంతరం లేదని అడ్వకేట్ జనరల్ సౌమేంద్ర నాథ్ ముఖర్జీ చెప్పారు. దుర్గా పూజ పందిళ్ల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 


దుర్గా పూజలు అక్టోబరు 11 నుంచి ఐదు రోజులపాటు జరుగుతాయి. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. 


Updated Date - 2021-10-07T21:56:31+05:30 IST