గల్ఫ్ వలసదారుల సమస్యలపై.. జగిత్యాలలో డచ్ రిపోర్టర్ అధ్యయనం

ABN , First Publish Date - 2021-03-05T01:49:20+05:30 IST

గల్ఫ్ వలసదారుల సమస్యలపై జగిత్యాలలోని పలు ప్రాంతాల్లో నేదర్లాండ్స్ ఓమ్రోప్ స్టిచింగ్(డచ్ బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్) దక్షిణ ఆసియా కరస్పాండెంట్ అలెట్టా ఆండ్రూ అధ్యయనం చేశారు.

గల్ఫ్ వలసదారుల సమస్యలపై.. జగిత్యాలలో డచ్ రిపోర్టర్ అధ్యయనం

జగిత్యాల: గల్ఫ్ వలసదారుల సమస్యలపై జగిత్యాలలోని పలు ప్రాంతాల్లో నేదర్లాండ్స్ ఓమ్రోప్ స్టిచింగ్(డచ్ బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్) దక్షిణ ఆసియా కరస్పాండెంట్ అలెట్టా ఆండ్రూ అధ్యయనం చేశారు. అక్కడి వలసదారుల కుటుంబ సభ్యులను, గల్ఫ్ వెళ్లి వెచ్చిన వారిని బుధవారం ఇంటర్వ్యూ చేసి పలు విషయాలు తెలుసుకున్నారు. ఆండ్రూ మొదట కోడిమయాల్ మండలం తిపాయిపల్లికి వెళ్లారు. అక్కడ ఇటీవల ఖతార్‌లో చనిపోయిన శ్రీనివాస్ భార్య నారుకుల్ల అనితను కలిశారు. అనితతో పాటు ఆమె కుటుంబ సభ్యులను సామాజిక భద్రత పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే భర్త చనిపోయిన తర్వాత అతను పనిచేసిన సంస్థ నుంచి గానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ ఏమైనా ఆర్థిక సహాయం అందిందా? అని అనితను ప్రశ్నించారు. దాంతో తాను ప్రస్తుతం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి పొందుతున్నట్లు అనిత తెలిపింది.   


అనంతరం ఇదే గ్రామానికి చెందిన ఒమన్ రిటర్నీ ఐలాపూర్ నర్సయ్యతో ఆండ్రూ మాట్లాడారు. నర్సయ్య 15 ఏళ్లు ఒమన్‌లో ఉండి వచ్చారు. ప్రస్తుతం స్వగ్రామంలోనే స్థిరపడ్డారు. ఆ తర్వాత ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు కార్మికులను పంపించే జగిత్యాలలోని హన్సిక మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీ సిబ్బందితో మాట్లాడారు. డచ్ రిపోర్టర్‌కు లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపాండ్ల, ఎన్నారై మిత్రా గైడ్ చేశారు. అలాగే ఓవర్సీస్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రతినిధి తోటా ధర్మేందర్ గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆమెకు వివరించారు.

Updated Date - 2021-03-05T01:49:20+05:30 IST