ప్రతి ఎకరాకు సాగునీరు
ABN , First Publish Date - 2021-03-03T07:22:07+05:30 IST
కాకినాడ, మార్చి2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రబీ సాగుకు నీటి ఎద్దడి లేకుండా పటిష్ట ప్రణాళికతో వ్యవహరిస్తున్నామని, నిరంతర పర్యవేక్షణలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించనున్నామని కలెక్టర్ డి మురళీధర్రెడ్డి తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులు, సాగు, తాగునీటికి కొర
రబీలో పూర్తి స్థాయి వరి దిగుబడికి చర్యలు
నీటి వినియోగంలో పొదుపు పాటించాలి : జిల్లా కలెక్టర్
కాకినాడ, మార్చి2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రబీ సాగుకు నీటి ఎద్దడి లేకుండా పటిష్ట ప్రణాళికతో వ్యవహరిస్తున్నామని, నిరంతర పర్యవేక్షణలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించనున్నామని కలెక్టర్ డి మురళీధర్రెడ్డి తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులు, సాగు, తాగునీటికి కొరత లేకుండా తీసుకుంటున్న చర్యలపై జాయింట్ కలెక్టర్ జి లక్ష్మీశ, కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో కలిసి మంగళవారం కలెక్టరేట్ కోర్టు హాల్లో ఆయన సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్, గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయ శాఖ అధికారులతో రబీ సాగుకు నీటి సరఫరా స్థితిగతులు, పంట పరిస్థితులపై సమీక్షించారు. సాగునీటికి ఇబ్బంది లేకుండా తీసుకుంటు న్న చర్యలపై ఆరా తీశారు. ఈ సీజన్లో పూర్తి స్థాయిలో సాగు దిగుబడులు సాధించేలా నీటి తడు లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ పనుల నేపఽథ్యంలో ఈనెల చివరి నాటికి గోదావరి కాలువలకు క్లోజర్ అమల్లోకి వస్తున్నందున నీటి సరఫరా నిలిచిపోతుందన్నారు. క్షేత్రస్థాయి అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ రబీ పంట ప్రణాళికను దిగ్విజయంగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో దాళ్వా పంటకాలంలో 1,61,632 హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగవుతోందని, రబీలో చిన్నా,పెద్దా తేడా లేకుండా ప్రతి రైతుకు మేలు జరిగేలా చూడాలన్నారు. సాగునీటిపై ఒత్తిడి ఉన్న ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామని, ఆయా మండలాల్లో రైతుల బృందాలు, వారు ఏర్పాటు చేసుకున్న ఇంజన్లకు ప్రభుత్వమే ఆయిల్ అందిస్తోందన్నారు. డ్రెయిన్ల నుంచి నీటిని కాలువలకు ఎత్తిపోసి, అక్కడి నుంచి నీటిని పంటలకు మళ్లిస్తామన్నారు. ఈ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇంకా ఈ సౌకర్యం అవసరమైన రైతులు గ్రామ వ్యవసాయ సహాయకు(వీఏఏ)లను సంప్రదించాలని సూచించారు. వారి సిఫార్సుతో ఇరిగేషన్ ఏఈలు తగిన చర్యలు తీసుకుంటారన్నారు. ప్రస్తుతం ఆయిల్ సరఫరాకు తూర్పు డెల్టాలో జిల్లాలో 24 ఏజన్సీలు, సెంట్రల్ డెల్టాలో 8 ఏజన్సీలు పనిచేస్తున్నాయని, మరికొన్ని అందుబాటులోకి రానున్నాయ న్నారు. వీఏఏలు మొదలు అధికారుల వరకు రైతులకు అందుబాటులో ఉండాలని, ఎప్పటికప్పుడు వారికి అవసరమైన సలహాలు అందించాలన్నారు. తూర్పు డెల్టాలో కాజులూరు, కరప, తాళ్లరేవు, పెదపూడి, ఆలమూరు, కపిలేశ్వరపురం, కె గంగవరం, రామచంద్రపురం తదితర మండలాలతోపాటు, సెంట్రల్ డెల్టాలో అమలాపురం, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, మామిడికుదురు, అయినవిల్లి తదితర మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులకు సూచించారు. తక్కువ నీటితో పంట సాగుచేసి అధిక దిగుబడులు సాధించేందుకు వీలు కల్పించే ఎండు-పండు విధానంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. తాగునీటి విషయంలో నెలాఖరు నాటికి అన్ని ట్యాంకులు నిండుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎండు- పండు విధానంలో నీటిని నిలుపుదల చేయరని, పొలంలో మట్టి తడిగా ఉంటే సరిపోతుందన్నారు. సమావేశంలో ఇరిగేషన్, డ్రెయిన్, గ్రామీణ నీటి సరఫరా అధికారులు ఆర్ శ్రీరామకృష్ణ, టి గాయత్రి దేవి, రవికుమార్, వ్యవసాయ శాఖ జేడీ కేఎస్వీ ప్రసాద్, డీడీ వీటీ రామారావు పాల్గొన్నారు.