కొత్త చెక్కు విధానంపై ఆర్బీఐ ఆదేశాలు
ABN , First Publish Date - 2021-03-17T02:09:00+05:30 IST
దేశవ్యాప్తంగా కొత్త చెక్కు ట్రంకేషన్ విధానాన్ని విస్తరించాలని భారతీయ
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కొత్త చెక్కు ట్రంకేషన్ విధానాన్ని విస్తరించాలని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నిర్ణయించింది. ఈ విధానం ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రమే అమలవుతోంది. దీనిని అన్ని బ్యాంకుల శాఖలకు సెప్టెంబరు 30నాటికి విస్తరించాలని ఆదేశించింది.
బ్యాంకులకు ఆర్బీఐ జారీ చేసిన నోటిఫికేషన్లో ఇమేజ్ బేస్డ్ చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్)ను అన్ని శాఖలకు సెప్టెంబరు 30 నాటికి విస్తరించాలని పేర్కొంది. సీటీఎస్ విధానం సమగ్రంగా అందుబాటులో ఉండాలని, కస్టమర్ ఉండే చోటుతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా సేవలు అందాలని తెలిపింది. దేశంలోని అన్ని బ్యాంకుల శాఖలన్నిటికీ సీటీఎస్ విధానాన్ని విస్తరించాలని నిర్ణయించినట్లు పేర్కొంది.
సీటీఎస్ అంటే...
చెక్కును జారీ చేసినప్పటి నుంచి నగదు చెల్లింపు జరిగే వరకు బ్యాంకు శాఖల మధ్య భౌతికంగా ఆ చెక్కు తిరగవలసిన అవసరం లేకుండా చేయడమే సీటీఎస్ విధానం.
2010 నుంచి అమలు
ఇదిలావుండగా, సీటీఎస్ విధానం 2010 నుంచి అమల్లో ఉంది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లోని బ్యాంకు శాఖల్లో అందుబాటులో ఉంది.