బెంగాల్‌లో సంబరాలొద్దు..హింస జరిగే ఛాన్స్: ఈసీ

ABN , First Publish Date - 2021-10-03T20:33:19+05:30 IST

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ చీఫ్ సెక్రటరీ హెచ్‌కే ద్వివేదికి

బెంగాల్‌లో సంబరాలొద్దు..హింస జరిగే ఛాన్స్: ఈసీ

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ చీఫ్ సెక్రటరీ హెచ్‌కే ద్వివేదికి ఎన్నికల కమిషన్ ఆదివారంనాడు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ఫలితాల అనంతరం హింసకు అవకాశాలున్నందున ఎలాంటి సంబరాలు జరక్కుండా చూడాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల అనంతర హింసకు అవకాశం ఈయరాదని పేర్కొంది.


''అక్టోబర్ 3న కౌంటింగ్‌కు ముందు, ఆ తర్వాత ఎలాంటి విజయోత్సవాలు, ఊరేగింపులకు అనుమతి ఇవ్వవద్దు'' అని ఈసీ సెక్రటరీ రాకేష్ కుమార్ ఆ లేఖలో పేర్కొన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఊరేగింపులు, ఉత్సవాలను ఇప్పటికే నిషేధించిన నేపథ్యంలో కమిషన్ ఆదేశాలకు లోబడి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. తమ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని కూడా స్పష్టం చేశారు. భవానీపూర్ నుంచి టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కౌంటింగ్ ప్రతీ రౌండ్‌లోనూ ఆధిక్యం కొనసాగిస్తూ రావడంతో పార్టీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారు. సీఎం నివాసం వద్దకు పెద్దఎత్తున చేరుకుని సంబరాలకు దిగారు. ఈ నేపథ్యంలో ఈసీ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.


కాగా, భవానీపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన ప్రియాంక టిబ్రేవాల్ శనివారం రాత్రి కోల్‌కతా హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం హింసాత్మక సంఘటనలు జరక్కుండా ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆదేశించాలని ఆ లేఖలో యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌ను కోరారు.

Updated Date - 2021-10-03T20:33:19+05:30 IST