వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ తేదీలు ప్రకటించిన ఇంగ్లండ్ బోర్డు

ABN , First Publish Date - 2020-06-03T01:14:51+05:30 IST

వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగే టెస్ట్ సిరీస్ తేదీలను ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) మంగళవారం ప్రకటించింది. కొత్తగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం

వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ తేదీలు ప్రకటించిన ఇంగ్లండ్ బోర్డు

లండన్: వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగే టెస్ట్ సిరీస్ తేదీలను ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) మంగళవారం ప్రకటించింది. కొత్తగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం హాంఫ్‌షైర్ బౌల్ వేదికగా తొలి టెస్ట్ జూలై 8వ తేదీన, ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా రెండు, మూడో టెస్ట్‌లు 16వ తేదీన, 24వ తేదీన జరుగనున్నాయి. అయితే ఈ తేదీల్లో మ్యాచ్‌ల నిర్వహణకు యూకే ప్రభుత్వం ఆమోదముద్ర వేయాల్సి ఉంది. జూన్‌లో జరగాల్సిన ఈ సిరీస్ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదాపడింది. అయితే ఈ సిరీస్‌ ఆడేందుకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు గత వారం అంగీకరించింది. వెస్టిండీస్ క్రికెటర్లు జూన్ 9వ తేదీన ఓల్డ్ ట్రాఫర్డ్‌కు చేరుకొని అక్కడ మూడు వారాల క్వారంటైన్‌లో ఉంటారు. ఆ తర్వాత సౌతాంప్టన్ వెళ్లి ప్రాక్టీస్ ప్రారంభిస్తారు. 


ఈ సందర్భంగా ఈసీబీ ఈవెంట్ డైరెక్టర్ స్టీవ్ ఎల్వర్తి మాట్లాడుతూ.. ‘‘అందరికీ సురక్షితమైన వాతావరణం కల్పించడమే మా ప్రధాన లక్ష్యం. ప్రభుత్వంతో, వైద్య సిబ్బందితో తరచూ చర్చిస్తున్నాము. ఇవి కేవలం ప్రతిపాదించిన తేదీలు మాత్రమే. వీటికి యూకే ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. ఈ టూర్ విజయవంతం అయ్యేందుకు సహకరిస్తున్న క్రికెట్ వెస్టిండీస్‌కు మా ధన్యవాదాలు. వచ్చే పలు వారాల్లో మళ్లీ క్రికెట్‌ని చూడాలని ఆశపడుతున్నాం’’ అని అన్నారు. 

Updated Date - 2020-06-03T01:14:51+05:30 IST