అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి

ABN , First Publish Date - 2021-10-23T05:11:31+05:30 IST

అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని, దీని కోసం రుణాలు దోహదం చేస్తాయని డీఆర్డీవో పీడీ గోపాల్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో లీడ్‌ బ్యాంకు ఆధ్వర్యంలో రుణ విస్తరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి
రుణ మేళలో ఏర్పాటు చేసిన స్టాల్‌ను ప్రారంభిస్తున్న ఎస్‌బీఐ డీజీఎం సత్యనారాయణపాణిగ్రహి, డీఆర్డీవో పీడీ గోపాల్‌రావు

రుణాలు పొంది బలోపేతం కావాలి

డీఆర్డీవో పీడీ గోపాల్‌రావు 

లీడ్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో రుణ మేళా


సిద్దిపేట అర్బన్‌, అక్టోబరు 22 : అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని, దీని కోసం రుణాలు దోహదం చేస్తాయని డీఆర్డీవో పీడీ గోపాల్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో లీడ్‌ బ్యాంకు ఆధ్వర్యంలో రుణ విస్తరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకులు ఇచ్చే రుణాలు తీసుకున్న వారు వాటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. ఈ సందర్భంగా 23 బ్యాంకులు తమ స్టాల్‌ను ఇక్కడ ఏర్పాటు చేసి రుణాల వివరాలను వివరించాయి. ఐకేపీ, ఎస్సీ కార్పొరేషన్‌, బీసీ కార్పొరేషన్‌, మెప్మా సంఘాలు కూడా స్టాళ్లను ఏర్పాటు చేశారు. బ్యాంకు రుణ మేళా ఉందన్న విషయం తెలుసుకున్న స్థానికులు అధిక సంఖ్యలో కార్యక్రమానికి హాజరై వివిధ రుణాల వివరాలను తెలుసుకున్నారు. ఆయా బ్యాంకులు ఏర్పాటు చేసుకున్న స్టాళ్లలో వారి బ్యాంకు పరిధిలో ఉన్న రుణాలు, వాటి సబ్సిడీలు, ఇన్‌స్టాల్‌మెంట్ల గురించి బ్యాంకు సిబ్బంది ప్రజలకు వివరించారు. అన్ని బ్యాంకులను కలుపుకొని 642 దరఖాస్తులు రాగా, అందులో 286 దరఖాస్తులకు అక్కడికక్కడే రుణాలను మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రావణ్‌, ఎస్‌బీఐ డీజీఎం సత్యనారాయణ పాణిగ్రహి, ఎస్‌బీఐ రీజినల్‌ మేనేజర్‌ ప్రియకుమార్‌, యూనియన్‌ బ్యాంక్‌ డీజీఎం శంకర్‌లాల్‌, మేనేజర్లు శేషగిరిరావు, రామకృష్ణుడు, ప్రేమ్‌సాగర్‌, మిట్టపల్లి బ్రాంచ్‌ మేనేజర్‌ సంతోష్‌, లక్ష్మి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-23T05:11:31+05:30 IST