కోలుకోవడానికి ఏడాది!
ABN , First Publish Date - 2020-05-04T05:44:48+05:30 IST
లాక్డౌన్ ఎత్తివేసినా ఆర్థిక వ్యవస్థ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా పలు కంపెనీల సీఈఓలు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఈ కష్టాల నుంచి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకునేందుకు ఎంత లేదన్నా ఏడాదైనా...
లాక్డౌన్ ఎత్తివేసినా ఆర్థిక వ్యవస్థ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా పలు కంపెనీల సీఈఓలు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఈ కష్టాల నుంచి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకునేందుకు ఎంత లేదన్నా ఏడాదైనా పడుతుందని వారి అంచనా. ఈలోపు పెద్ద సంఖ్యలో కొలువులూ గల్లంతయ్యే ప్రమాదం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- లాక్డౌన్ తర్వాతా కరోనా కష్టాలు
- 40 శాతం ఆదాయాలకు గండి
- ఉద్యోగాల్లోనూ కోతలు
- సీఐఐ సీఈఓ సర్వే వెల్లడి
న్యూఢిల్లీ: లాక్డౌన్ తర్వాత ఆర్థిక రంగానికి ‘కరోనా’ కష్టాలు తప్పేలా లేవు. ఈ నెల 17 తర్వాత లాక్డౌన్ ఎత్తివేసినా ఆర్థిక, పారిశ్రామిక రంగాలు కోలుకునేందుకు ఏడాదికిపైగా సమయం పడుతుందని భావిస్తున్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన ఒక సర్వేలో 45 శాతం మంది సీఈఓలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. దాదాపు 300 మందికిపైగా కంపెనీల సీఈఓలను సంప్రదించి సీఐఐ ఈ సర్వే రూపొందించింది. సర్వేలో పాల్గొన్న సీఈఓల్లో మూడింట రెండొంతుల మంది సూక్ష్మ, మధ్య, చిన్న తరహా కంపెనీల (ఎంఎ్సఎంఈ) సీఈఓలు. వీరిలో 65 శాతం మంది 2020 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీల రాబడులు 40 శాతానికి పైగా పడిపోతాయని చెప్పారు. ఆర్థిక సంవత్సరం మొత్తానికి చూసినా ఈ నష్టం 20 నుంచి 40 శాతం వరకు ఉండొచ్చని వీరి అంచనా.
కొలువులకూ ప్రమాదం
కోవిడ్-19 దెబ్బతో ఉద్యోగాలకూ ముప్పు తప్పేలా లేదు. ఆయా రంగాల్లో ఎంత లేదన్నా 15 నుంచి 30 శాతం మంది ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం ఉందని 45 శాతం మంది సీఈఓలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతానికి ఉద్యోగుల తీసివేతగానీ, జీతాల్లో కోతగానీ లేవని మూడింట రెండొంతుల మంది సీఈఓలు చెప్పారు. కరోనా తర్వాత ఎగుమతుల కంటే.. దేశీయ డిమాండే ముందుగా పుంజుకుంటుందని వీరి అంచనా.
‘సాయం’ కావాల్సిందే
కరోనాకు ముందే భారత ఆర్థిక వ్యవస్థ నీరసించింది. డిమాండ్ చతికిలపడింది. లాక్డౌన్తో ఆర్థిక రథ చక్రాలు పూర్తిగా ఆగిపోయాయి. జాగ్రత్తగా లాక్డౌన్ను దశలవారీగా ఎత్తివేయడంతో పాటు ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక సహాయ ప్యాకేజీ ప్రకటించక తప్పదని సర్వే పేర్కొంది.
రిటైలర్ల సందిగ్ధం
కేంద్ర ప్రభుత్వం సోమవారం నుంచి లాక్డౌన్ నిబంధనలను కొంత సడలించింది. అయితే రాష్ట్రాల నుంచి మాత్రం దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ముఖ్యంగా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏ దుకాణాన్నీ అనుమతించకూడదని పలు రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఒకవేళ అనుమతించినా ఆహార పదార్ధాలు, నిత్యావసర వస్తువులు అమ్మకాన్ని మాత్రమే అనుమతించాలని యోచిస్తున్నాయి. దీనిపై స్పష్టత రానంత వరకు మాల్స్ పూర్తి స్థాయిలో తెరవడం కష్టమని రిటైల్ సంస్థలు భావిస్తున్నాయి.
ఈ-కామర్స్ సంస్థలదీ అదే పరిస్థితి
ఈ-కామర్స్ సంస్థలు ఇప్పటికే నిత్యావసర వస్తువుల అమ్మకాలను చేపడుతున్నాయి. సోమవారం నుంచి నిత్యావసరేతర వస్తువుల విక్రయానికి ఈ సంస్థలను కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే ఈ సంస్థల ద్వారా తమ వస్తువులు అమ్మే వ్యాపారుల్లో ఎక్కువ మంది కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రెడ్ జోన్లలో ఉన్నారు. దీంతో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ ఈ-కామ ర్స్ సంస్థల అమ్మకాలూ పెద్దగా ఉండకపోవచ్చని భావిస్తున్నారు.
ఇలా చేస్తే మేలు
కోవిడ్-19 కష్టాల నుంచి బయటపడేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్నీ సీఐఐ ప్రభుత్వానికి సూచించింది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు ఉండే అన్ని జిల్లాల్లో పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపాలను పూర్తి స్థాయిలో అనుమతించాలని కోరింది. తద్వారా ఉద్యోగుల తీసివేతలను చాలా వరకు అడ్డుకోవచ్చని తెలిపింది. అయితే ఇదే సమయంలో కంపెనీలు, వ్యాపార సంస్థలు.. కార్మికులు, ఉద్యోగుల ‘ఆరోగ్య’ భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. జీడీపీలో ఆయా జిల్లాల వాటా, పరిశ్రమల సాంద్రత ఆఽధారంగా ఇలాంటి జిల్లాలను గుర్తించాలని సీఐఐ సూచించింది.