విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-10-22T06:08:18+05:30 IST

విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం పేర్కొన్నారు.

విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి
సదస్సులో మాట్లాడుతున్న అజేయ కల్లం

రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం


తిరుపతి(విశ్వవిద్యాలయాలు), అక్టోబరు 21: విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం పేర్కొన్నారు. ఏపీ జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీలో గురువారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్య, వైద్యాన్ని ప్రజలందరికీ ఉచితంగా అందించే బాధ్యతను ప్రభుత్వం స్వీకరించాలన్నారు. యూనివర్సిటీలన్నీ స్వయం ప్రతిపత్తితో స్వతంత్రంగా నడవాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు, 16 నర్సింగ్‌ కాలేజీలు ఏర్పాటు చేయడం శుభదాయమన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చెర్మన్‌ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది బాలికల్లో 860 మంది కాలేజీ స్థాయి విద్యను అభ్యసిస్తున్నారని, ఈ నిష్పత్తి పెరగాల్సి ఉందన్నారు. సక్రమంగా పనిచేయని 50 ఇంజినీరింగ్‌ కాలేజీలు, 100 డిగ్రీ కాలేజీలను ఏడాది కాలంలో మూత వేశామన్నారు. జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. వైద్య రంగంలో కేరళ తర్వాత ఏపీ రెండో స్థానంలో ఉందని తెలిపారు. తిరుపతి మేయర్‌ శిరీష, పద్మావతి వర్సిటీ వీసీ జమున, ఎస్వీయూ వీసీ రాజారెడ్డి, స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగమ్మ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ వర్సిటీ వీసీ పద్మనాభరెడ్డి, ఎస్వీయూ, పద్మావతి, వెటర్నరీ వర్సిటీ రిజిస్ట్రార్లు హుస్సేన్‌, మమత, రవి, సీమ మేధావుల ఫోరం కన్వీనర్‌ పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-22T06:08:18+05:30 IST