నేడు బీజేపీలోకి ఈటల

ABN , First Publish Date - 2021-06-14T08:50:53+05:30 IST

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సోమవారం బీజేపీలో చేరనున్నారు.

నేడు బీజేపీలోకి ఈటల

  • ఆయనతో పలువురు నేతలు కూడా
  • ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి
  • నిన్ననే హస్తిన చేరిన బండి సంజయ్‌


హైదరాబాద్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సోమవారం బీజేపీలో చేరనున్నారు. ఉదయం 11.30 గంటలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఒకరు ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనకు కాషాయ కండువా వేయనున్నారు. అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఈటల కలుసుకుంటారు. సోమవారం ఉదయం ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్‌ జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, గండ్ర నళిని, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి, మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌, అందె బాబయ్య తదితరులు ఉదయం 6 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆదివారం సాయంత్రమే ఢిల్లీ చేరుకున్నారు. కాగా, కొవిడ్‌ దృష్ట్యా 20 మంది ముఖ్య నేతలకు మాత్రమే పార్టీ కేంద్ర కార్యాలయంలో అనుమతి ఉంటుందని బీజేపీ ముఖ్యనేత ఒకరు తెలిపారు.


భైంసా అల్లర్లలో కీలక సూత్రధారిని వదలిపెట్టారు: సంజయ్‌

భైంసా అల్లర్లలో అసలు వ్యక్తులను వదలిపెట్టి అమాయకులపై పీడీ యాక్టు నమోదు చేశారని బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అల్లర్లకు ప్రధాన సూత్రధారి అయిన వ్యక్తిపై కూడా పీడీ యాక్టు పెట్టలేదని మండిపడ్డారు. పోలీసు అధికారుల వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం సంజయ్‌ న్యాయనిపుణులతో చర్చించినట్లు పార్టీవర్గాలు తెలిపాయి. 

Updated Date - 2021-06-14T08:50:53+05:30 IST