ఆర్టీసీ అభ్యున్నతికి కృషి
ABN , First Publish Date - 2021-10-23T07:04:00+05:30 IST
ఏపీ ఆర్టీసీ అభ్యున్నతికి కృషి చేస్తానని నెల్లూరుజోన్ చైర్పర్సన్ బి.సుప్రజారెడ్డి తెలిపారు.
నెల్లూరు జోన్ చైర్పర్సన్ సుప్రజారెడ్డి
తిరుపతి(కొర్లగుంట), అక్టోబరు 22: ఏపీ ఆర్టీసీ అభ్యున్నతికి కృషి చేస్తానని నెల్లూరుజోన్ చైర్పర్సన్ బి.సుప్రజారెడ్డి తెలిపారు. చైర్పర్సన్ హోదాలో తొలిసారిగా శుక్రవారం ఆమె తిరుపతి పర్యటనకు వచ్చారు. ఉదయం మంగళం డిపోను సందర్శించారు. ప్రయాణికులు, ఉద్యోగుల సదుపాయాలను పరిశీలించారు. అనంతరం అలిపిరి డిపోకు చేరుకున్న ఆమె గ్యారేజీ ఆవరణలో మొక్కలు నాటారు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ శిక్షణ తరగతులను పరిశీలించారు. అలిపిరి డిపోకు సంబంధించి టీటీడీకి చెల్లిస్తున్న అద్దె భారాన్ని అధికారులు ఆమె దృష్టికి తీసుకురాగా.. ప్రభుత్వం, టీటీడీ ఉన్నతాధికారులతో చర్చిస్తామని చెప్పారు. అనంతరం తిరుపతి సెంట్రల్ బస్సుస్టేషన్లో తనిఖీలు చేశారు. ఆర్టీసీ కల్పిస్తున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయంటూ ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. గ్యారేజ్లో సిబ్బంది, కార్మికులతో మాట్లాడారు. అతిపెద్ద సంస్థ అయిన ఆర్టీసీలో తాను కూడా ఒక భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. హెవీడ్రైవింగ్ శిక్షణ తరగతుల నిర్వహణ చాలా బాగుందన్నారు. ఆమెతోపాటు నెల్లూరు జోన్ ఆర్టీసీ ఈడీ గోపీనాథ్రెడ్డి, తిరుపతి ఆర్ఎం చెంగల్రెడ్డి, డిప్యూటీ సీటీఎం మధుసూదన్, సీటీఎం శ్రీనివాసరావు, ఏటీఎం విశ్వనాథ్, డిపో మేనేజర్లు మద్దిలేటి, ప్రవీణ్కుమార్, రాజవర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.