ఐదు పోస్టులకు ఎనిమిది నామినేషన్లు
ABN , First Publish Date - 2021-05-15T06:09:12+05:30 IST
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు శుక్రవారంతో నోటిఫికేషన్ గడువు ముగిసింది.
తిరుపతి కార్పొరేషన్ కో ఆప్షన్ సభ్యుల ఎంపికకు గడువు పూర్తి
తిరుపతి, మే 14 (ఆంధ్రజ్యోతి): తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు శుక్రవారంతో నోటిఫికేషన్ గడువు ముగిసింది. కార్పొరేషన్కు ఐదుగురు సభ్యులను ఎంపికచేసుకునే అవకాశం అధికారపార్టీకి ఉంది. ఈక్రమంలో 8 మంది నామినేషన్లు వేశారు. మున్సిపల్ చట్టం ప్రకారం.. ఐదుగురు సభ్యులో ఇద్దరు మైనారిటీ వర్గాలకు చెందిన వారై ఉండాలి. మిగతా ముగ్గురిలో మున్సిపల్ పాలనలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. అంటే.. గతంలో చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్, సభ్యులుగా పనిచేసినవారు, గానీ, కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో గెజిటెడ్ అధికారిగా పదవీ విరమణ పొంది, మున్సిపల్ పాలనలో ప్రత్యేక పరిజ్ఞానం కలిగినవారు అర్హులు. ఈ నిబంధనల వల్ల కో ఆప్షన్ ఆశించిన పలువురు వైసీపీ నాయకులకు అవకాశం దక్కలేదని తెలుస్తోంది.
కొత్త కోఆప్షన్ సభ్యులు వీరే?
మైనారిటీ కోటా కింద ఇమామ్ (ముస్లిం), ఎమ్మెల్యే పీఏ రామాంజనేయులు భార్య (క్రిస్టియన్)కు అవకాశం దక్కనుంది. గతంలో తిరుపతి మన్సిపల్ కో ఆప్షన్గా పనిచేసిన రుద్రరాజు శ్రీదేవి, కౌన్సిలర్గా ఉన్న ఖాదర్ బాషాతోపాటు అధికారిగా పనిచేసి పదవీవిరమణ చేసిన కోటాలో తుడా వెంకటరెడ్డికి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పచ్చజెండా ఊపినట్టు సమాచారం. ఈ ఐదుగురితో పాటు మిగతా ముగ్గురు డమ్మీగా నామినేషన్లు వేసినట్టు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో అధికారంగా కో ఆప్షన్ సభ్యులను ప్రకటించనున్నారు.