యాదాద్రి క్షేత్రంలో ఏకాదశి లక్ష పుష్పార్చన

ABN , First Publish Date - 2021-10-17T00:27:14+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్షపుష్పార్చన శాస్త్రోక్తంగా కొనసాగింది.

యాదాద్రి క్షేత్రంలో ఏకాదశి లక్ష పుష్పార్చన

యాదాద్రి: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్షపుష్పార్చన శాస్త్రోక్తంగా కొనసాగింది. బాలాలయంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించిన ఆచార్యులు ప్రత్యేకవేదికపై అధిష్ఠింపజేశారు. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చకులు, వేదపండితులు లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. ప్రతీ ఏకాదశి పర్వదినం రోజున స్వామిని వివిధ రకాల పుష్పాలతో అర్చించడం ఆలయ సంప్రదాయం. స్వామికి నిత్యారాధనలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. వేకువజామున సుప్రభాతంతో ఆరంభమైన నిత్యపూజలు రాత్రివేళ శయనోత్సవాలతో ముగిశాయి. యాదారక్షేత్రంలో శనివారం వారాంతపు భక్తుల సందడి నెలకొంది. వేకువజాము నుంచే ఇష్టదైవాలను దర్శించుకునేందుకు యాత్రాజనులు పెద్దసంఖ్యలో క్యూలైన్లలో బారులుతీరారు. ఆర్జిత సేవోత్సవాల్లో భక్తులు కుటుంబసమేతంగా పాల్గొని మొక్కు తీర్చుకున్నారు. స్వామికి భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా శనివారం రూ.13,23,883 ఆదాయం సమకూరింది.

Updated Date - 2021-10-17T00:27:14+05:30 IST