ఆస్తినంతా లాక్కున్నారు

ABN , First Publish Date - 2020-09-24T09:30:12+05:30 IST

ఆ దంపతులకు ఒక్కగానొక్క కొడుకు. చిన్నప్పటి నుంచి అతడిని అల్లారుముద్దుగా పెంచారు. ఏదడిగినా కాదనకుండా కొనిచ్చారు.

ఆస్తినంతా లాక్కున్నారు

తల్లిదండ్రులను వెళ్లగొట్టిన కొడుకు, కోడలు

సొంతూరిలో అడుక్కుతింటున్న వృద్ధ దంపతులు


రామాయంపేట, సెప్టెంబరు 23: ఆ దంపతులకు ఒక్కగానొక్క కొడుకు. చిన్నప్పటి నుంచి అతడిని అల్లారుముద్దుగా పెంచారు. ఏదడిగినా కాదనకుండా కొనిచ్చారు. చివరికి కన్నతల్లిదండ్రులనే ఇంటి నుంచి వెళ్లగొట్టాడా కర్కోటక కొడుకు. మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం డి.ధర్మారం గ్రామానికి చెందిన నాగయ్య, అంజమ్మ దంపతులకు రాజు ఒక్కడే సంతానం. అతడి వివాహం అయ్యాక ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఆస్తి అమ్మాలంటూ కోడలు తరచూ అత్తా, మామ, భర్తతో ఘర్షణపడేది. ఆ బాధ భరించలేక ఆ దంపతులు ఊరిలోని పొలం, ఇల్లును అమ్మారు. ఆ డబ్బులతో హైదరాబాద్‌లో కొడుకుకు ఓ ఇల్లు కొనిచ్చారు. 15 నెలలుగా వారు కూడా కొడ్డుకు వద్దే ఉంటున్నారు.


కానీ కొడుకు, కోడలు వారిని ఆదరించేవారు కాదు. సమయానికి అన్నం కూడా పెట్టకుండా కడుపు మార్చేవారు. పైగా తమకు అప్పులు పెరిగాయంటూ.. డబ్బు అవసరముందంటూ రాజు తన తల్లి మెడలోని పుస్తెల తాడును కూడా తీసుకున్నాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలంటూ కోడలు అత్తామామలపై చేయిచేసుకునేది. దీంతో 4 నెలల క్రితం నాగయ్య, అంజమ్మ.. ధర్మారం చేరుకున్నారు. ఊరిలో ఇల్లు  లేకపోవడంతో రోడ్డు పక్కనే అడ్డుగా ఓ చీరను కట్టి అందులో తల దాచుకుంటున్నారు. బుధవారం గ్రామ పెద్దలు కల్పించుకుని రామాయం పోలీస్‌ స్టేషన్‌లో ఆ దంపతులతో ఫిర్యాదు చేయించారు. గురువారం కొడుకు, కోడలిని పిలిపించి కౌన్సెలింగ్‌ ఇస్తామని ఎస్సై మహేందర్‌ తెలిపారు.

Updated Date - 2020-09-24T09:30:12+05:30 IST