బీజేపీ నేత కైలాశ్ విజయవర్గీయ వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం
ABN , First Publish Date - 2020-10-30T21:32:46+05:30 IST
బీజేపీ సీనియర్ నేత కైలాశ్ విజయవర్గీయ వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్
న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత కైలాశ్ విజయవర్గీయ వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ (ఈసీ) శుక్రవారం తప్పుబట్టింది. మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ సింగ్, కమల్నాథ్లను ఉద్దేశించి ‘‘చున్ను-మున్ను’’ అని మాట్లాడటం సరికాదని, ఇటువంటి పదాలను ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న కాలంలో వాడవద్దని తెలిపింది.
కైలాశ్ విజయవర్గీయ ‘‘చున్ను-మున్ను’’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని పేర్కొంది. బహిరంగంగా మాట్లాడేటపుడు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న కాలంలో ఇటువంటి మాటలు మాట్లాడవద్దని కోరింది. ఈ నెల 14న మధ్య ప్రదేశ్లోని సన్వేర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కైలాశ్ విజయవర్గీయకు ఈ నెల 26న ఈసీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
మధ్య ప్రదేశ్లో 28 శాసన సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నవంబరు 3న జరుగుతాయి.