అంతా గప్చుప్!
ABN , First Publish Date - 2021-04-16T05:12:10+05:30 IST
పక్షం రోజులకు పైగా హోరెత్తిన తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది.
ముగిసిన ప్రచార పర్వం
గెలుపుపై ఎవరిధీమా వారిదే!
నెల్లూరు, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): పక్షం రోజులకు పైగా హోరెత్తిన తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. బరిలోని ఐదు పార్టీల అభ్యర్థులు, వారి వెంట ఆయా పార్టీల అగ్రనాయకులు నిమిషం తీరికలేక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చివరి రోజున టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా సత్యవేడులో కార్యకర్తల సమావేశం తిరుపతిలో టీడీపీని గెలిపించాలని కోరుతూ ప్రచారాన్ని ముగించారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తిరుమలలో ఎన్నికల ప్రచారం ముగించారు. ఇక వైసీపీ అభ్యర్థి గురుమూర్తి కూడా తిరుపతిలో ప్రచారం చేశారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ వివిధ సామాజికవర్గాలతో సమావేశమై తన గెలుపునకు సహకరించమని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తనను గెలిపించమని మీడియా ద్వారా అభ్యర్థించారు. సీపీఎం అభ్యర్థి నెల్లూరు యాదగిరి ఎన్నికల నిర్వహణపై పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం రాష్ట్రంలోని నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రధాన పార్టీల నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు గురువారం పూర్తిగా పోలింగ్ నిర్వహణ ఏర్పాట్లలో బిజీగా గడిపారు. ప్రచార గడువు ముగియడంతో తమ తమ సొంత జిల్లాలకు తరలివెళ్లారు.