ప్రవర్తనా నియమావళి అమలు ఎక్కడ?
ABN , First Publish Date - 2021-03-03T07:11:48+05:30 IST
(అమలాపురం-ఆంధ్రజ్యోతి) మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి నామమాత్రంగా కూడా అమలు కావడంలేదు. అధికార వైసీపీకి చెందిన నాయకులకు ఎన్నికల అధికారులు సంపూర్ణ అండదండలు అందిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు, ఆ పార్టీ తరుపున పోటీలో ఉన్న అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార వైసీపీ నాయకులు ఎన్నికల కోడ్ను యథేచ్ఛగానే ఉల్లంఘిస్తున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలు ప్రేక్షకపాత్ర వహించాల్సి
భారీ జనసందోహంతో అధికార వైసీపీ నేతల ప్రచారాలు
వైసీపీ నాయకులతో కలసి వలంటీర్ల పింఛన్ల పంపిణీ
పట్టించుకోని ఎన్నికల యంత్రాంగం
(అమలాపురం-ఆంధ్రజ్యోతి)
మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి నామమాత్రంగా కూడా అమలు కావడంలేదు. అధికార వైసీపీకి చెందిన నాయకులకు ఎన్నికల అధికారులు సంపూర్ణ అండదండలు అందిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు, ఆ పార్టీ తరుపున పోటీలో ఉన్న అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార వైసీపీ నాయకులు ఎన్నికల కోడ్ను యథేచ్ఛగానే ఉల్లంఘిస్తున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలు ప్రేక్షకపాత్ర వహించాల్సి వస్తోంది. ఎన్నికల సంఘం పట్టణాల్లో ఉన్న వార్డు వలంటీర్లను విధులకు దూరంగా ఉంచాలని ఇచ్చిన ఆదేశాలు ఎక్కడా అమలు కావడంలేదు. అధికార వైసీపీ తమ అభ్యర్థులను వెంటబెట్టుకు వెళ్లి మరీ పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. ఎక్కడికక్కడే మద్యం పంపిణీలు, ఇతరత్రా ప్రలో భాలకు రాజకీయ పార్టీలు తెర లేపుతున్నా పట్టించుకునే పరిస్థితులు జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఎక్కడా కానరావడంలేదు. అమలాపురం, రామచంద్రపురం పురపాలక సంఘాల ఎన్నికలను ఆ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లు బోయిన వేణుగోపాలకృష్ణలు పార్టీల అభ్యర్థులను గెలిపించుకునేందుకు భారీ జనసందోహంతో ఆయా వార్డుల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎన్నికల సంఘం ఐదుగురికి మించి ఉండకూడదన్న నిబంధన జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న ఏ మున్సిపాలిటీలోను నామమాత్రంగా కూడా అమలుకావడంలేదు. ఇక ఎన్నికల కార్యాలయాల్లో వైసీపీ అభ్యర్థులు, వారి అనుచరగణాల హంగామా అధికంగా కనిపిస్తోంది. వైసీపీ అభ్య ర్థులు కోడ్ నిబంధనలు ఉల్లంఘించి ప్రచారాలు చేస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు సైతం మౌనం వహించాల్సి వస్తోంది. ఫిర్యాదు చేస్తున్నా ఎవరూ పట్టించుకునే పరిస్థితులు లేవన్నది వీరి ప్రధాన ఆరోపణ.
ఇక అమలా పురం పట్టణంలో 26వ వార్డులో ఎన్నికల బరిలో ఉన్న వైసీపీ అభ్యర్థి భర్త పింఛన్లు పంపిణీచేస్తూ ఆమెకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని ఆ వార్డులో బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న సరిదే నాగరాజకుమారి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫోటో జతచేసి ఫిర్యాదు చేశారు. వార్డు వలంటీరు ద్వారా పోటీలో ఉన్న అభ్యర్థి భర్త యెం డమూరి శ్రీనివాస్ వితంతు, వృద్ధాప్య పింఛన్లను వలంటీర్లను వెంట బెట్టుకుని వెళ్లి అందజేస్తున్నట్టు ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.పోటీలో ఉన్న అభ్య ర్థులు ఎవరికి వారే నిబంధనలు ఉల్లంఘించి ఎన్నికల ప్రచారం చేస్తున్నా అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఫ్లెక్సీల తొలగింపులో కూడా మున్సిపల్ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ ఫ్లెక్సీలను యథాస్థానంలో ఉంచి నేతల ఫోటోలు కనిపించకుండా జాగ్రత్తలు చేపట్టారు. ఇక మార్చి నెల రేషన్ పంపిణీలో వలంటీర్లు యథావిధి గానే నిబంధనలు ఉల్లంఘించి విధులు నిర్వహిస్తున్నారు. ఒకవైపు పింఛన్లు, మరోవైపు రేషన్ పంపిణీతో పరోక్షంగా వైసీపీ అభ్యర్థుల తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారనేది మరో ఆరోపణ.