విద్యుదాఘాతంలో ఏనుగు మృతి
ABN , First Publish Date - 2021-12-08T07:11:54+05:30 IST
విద్యుదాఘాతంతో ఓ ఒంటరి ఏనుగు మృతి చెందింది.
బంగారుపాళ్యం, డిసెంబరు 7: విద్యుదాఘాతంతో ఓ ఒంటరి ఏనుగు మృతి చెందింది. బంగారుపాళ్యం మండలంలోని కీరమంద పంచాయతీ వేపనపల్లె సమీపంలో ఉన్న ఐరాల సుబ్రహ్మణ్యం పొలాలపై సోమవారం రాత్రి ఒంటరి ఏనుగు దాడి చేసింది. పొలంలోని బోరు మోటారుకు సరఫరా అవుతున్న విద్యుత్ తీగలను పీకేసింది. ఈ సందర్భంగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది. మంగళవారం ఈ సమాచారం అందుకున్న డీఆర్వో శివకుమార్, ఎఫ్ఎ్సవో ధనంజయ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏనుగు కళేబరాన్ని పరిశీలించి, తిరుపతి జూపార్కు అధికారులకు సమాచారమిచ్చారు. అక్కడి నుంచి వచ్చిన పశువైద్య నిపుణులు తోయిబాసింగ్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. ఇదిలా ఉంటే.. గతంలో మొగిలివారిపల్లె, టేకుమందలో ఒక్కొక్కటి చొప్పున రెండు ఏనుగులు విద్యుదాఘాతంతోనే మృతి చెందాయి. ఇపుడు మూడో ఏనుగు కూడా ఇలాగే మృతి చెందడం గమనార్హం.
టీటీడీ జోక్యంతోనే సమస్యకు పరిష్కారం
ఏనుగులు ఇటీవల తరచుగా జనావాసాల్లోని పొలాలపై పడుతున్నాయి. ఇవి రాకుండా ఉండాలంటే అడవుల చుట్టూ కందకాలు తవ్విస్తే సరిపోదు. రైలు పట్టాలకు ఉపయోగించే ఇనుప రాడ్లను పెట్టించాలి. అపుడే వాటిని ఆపగలం. టీటీడీ జోక్యం చేసుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.