పోలీసుల్లో కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-05-31T10:52:23+05:30 IST

పోలీసులు అరెస్ట్‌ చేసిన నిందితుడ్ని కోర్టుకు హాజరు పర్చే ముందు వైద్య పరీక్షలు చేయించారు.

పోలీసుల్లో కరోనా కలకలం

  • అరెస్టు చేసిన నిందితుడికి ప్రాథమిక పరీక్షల్లో పాజిటివ్‌


ఏలూరు క్రైం, మే 30 : పోలీసులు అరెస్ట్‌ చేసిన నిందితుడ్ని కోర్టుకు హాజరు పర్చే ముందు వైద్య పరీక్షలు చేయించారు. వచ్చిన ఫలితాన్ని చూసి వారు ఖంగుతిన్నారు. యుద్ధ ప్రాతిపదికన అధికారుల ఆదేశాల మేరకు వెంటనే చర్యలు చేపట్టారు. నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులకు  అదృష్టవశాత్తు ఎలాంటి కరోనా వైరస్‌ లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఏలూరు రూరల్‌ సర్కిల్‌ పరిధిలో ఒక ట్యాంకర్‌లో కల్తీ పెట్రోలు తరలిస్తున్నట్టు శుక్రవారం సమాచారం అందడంతో సర్కిల్‌ పరిధిలోని ఒక పోలీస్‌ స్టేషన్‌కు చెందిన పోలీసులు వాహనాలు తనిఖీలు చేసి ఆ ట్యాంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు.


ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన ఆ డ్రైవర్‌ను విచారించగా కల్తీ పెట్రోలు తూర్పు గోదావరి జిల్లా నుంచి కేరళకు వెళ్తున్నట్టుగా గుర్తించారు. అతన్ని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పర్చే నిమిత్తం ప్రాథమిక వైద్య పరీక్షలు చేయించగా ఆ నిందితుడికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారి ఆదేశాల మేరకు ఆస్టేషన్‌లో ఉన్న వారికి అత్యవసరంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అదృష్టవశాత్తు వారెవరికీ కరోనా వైరస్‌ లేదని శనివారం తేలడంతో  ఊపిరి పీల్చుకున్నారు. కరోనా అనుమానిత నిందితుడ్ని ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2020-05-31T10:52:23+05:30 IST