అత్యవసరమైతేనే బయటకు రండి

ABN , First Publish Date - 2021-05-17T04:18:06+05:30 IST

ప్రజలు కరోనా వేగంగా విజృంభిస్తున్న తరుణంలో అత్యవసరమైతేనే బయటకు రావాలే తప్ప.. అనవసరంగా రావద్దని తహసీల్దార్‌ నాగరాజు అన్నారు.

అత్యవసరమైతేనే బయటకు రండి
కట్టువపల్లిలో మాట్లాడుతున్న తహసీల్దార్‌ నాగరాజు

 మనుబోలు, మే 16: ప్రజలు కరోనా వేగంగా విజృంభిస్తున్న తరుణంలో అత్యవసరమైతేనే బయటకు రావాలే తప్ప.. అనవసరంగా రావద్దని తహసీల్దార్‌ నాగరాజు అన్నారు. మండలంలోని కట్టువపల్లిలో ఆదివారం చెగువేరా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గ్రామంలో కరోనా నివారణ చర్యలు చేపట్టారు. గ్రామమంతా బ్లీచింగ్‌, సోడియం హైపోక్లోరైట్‌ పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు సురేష్‌, అధ్యక్షుడు గుండాల ఆదినారాయణ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో యువకులు ముందుకు వచ్చి బాధ్యతగా వారి వారి గ్రామాలను కాపాడుకునే పనులు చేపట్టాలన్నారు. ‘మన ఊరు-మన బాధ్యత’ అనుకుంటే గ్రామాలు పరిశుభ్రంగా ఉంచుకోవచ్చునన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొవిడ్‌ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు సన్నారెడ్డి జానకిరామిరెడ్డి, కేజీఎఫ్‌ యువత పాల్గొన్నారు.  

వెంకటాచలం, మే 16 : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పాక్షిక కర్ఫ్యూ విధించిందని, అత్యవసరం ఉంటేనే ఇళ్లల్లో నుంచి బయటకు రావాలని, కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని ఎస్‌ఐ షేక్‌ కరీముల్లా హెచ్చరించారు. మండలంలోని పలు గ్రామాల్లో కర్ఫ్యూ తీరును ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించిన పలువురిపై 144 సెక్షన్‌ కింద కేసులు నమోదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, శానిటైజర్లు వినియోగించాలని కోరారు.  

ఇందుకూరుపేట, మే 16 : ప్రభుత్వ ఆదేశాలు, జిల్లా అధికారుల ఉత్తర్వులతో లాక్‌డౌన్‌, 144వ సెక్షన్‌ను మండల పరిధిలో అమలు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ రెండు వారాలకు చేరువకానున్న నేపథ్యంలో ప్రజల సహకారంతో  శాంతిభద్రతలతో పాటు, కరోనా కట్టడి కూడా జరుగుతుందన్నారు. ముఖ్యంగా పర్యాటక రంగం, ఆక్వా పరిశ్రమలు, ఆకుకూరల రైతులతో నిత్యం రద్దీగా ఉండే ప్రయాణాలు కూడా తగ్గాయని తెలిపారు. అత్యవసరాలు, అనుమతుల మేరకు ఆసుపత్రి పనుల నిమిత్తం సొంత వాహనాలకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు.  

Updated Date - 2021-05-17T04:18:06+05:30 IST