కువైట్‌లోని భారత ఎంబసీ.. సందర్శకుల కోసం ఉచిత వాహన సౌకర్యం

ABN , First Publish Date - 2021-04-06T22:26:58+05:30 IST

కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం సందర్శకుల కోసం ఉచిత షటిల్ వాహన సేవలను ప్రారంభించింది.

కువైట్‌లోని భారత ఎంబసీ.. సందర్శకుల కోసం ఉచిత వాహన సౌకర్యం

కువైట్ సిటీ: కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం సందర్శకుల కోసం ఉచిత షటిల్ వాహన సేవలను ప్రారంభించింది. దౌత్య భవనం ప్రవేశం నుంచి ఎంబసీ ప్రాంగణం వరకు పూర్తి ఉచితంగా సందర్శకులు ఈ వాహనంలో ప్రయాణించవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. ప్రధానంగా ఈ సేవలను రాయబార కార్యాలయాన్ని సందర్శించే వృద్ధులు, చిన్న పిల్లలతో వచ్చేవారు, నడవలేని స్థితిలో ఉన్నవారి కోసం తీసుకువచ్చినట్లు ఎంబసీ వెల్లడించింది. కార్యాలయం పనిచేసే అన్ని రోజులలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ షటిల్ సర్వీస్ అందుబాటులో ఉంటుందని, దీనికి ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ఎంబసీ తెలియజేసింది. అలాగే అన్ని కొవిడ్-19 నిబంధనలను అనుసరించి ఈ సర్వీస్ నడపనున్నట్లు ఎంబసీ అధికారులు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం ఎంబసీ ఎంట్రీ కాంపౌండ్ మెయిన్ రోడ్‌కు మార్చడంతో కార్యాలయానికి చేరుకోవడానికి సందర్శకులు చాలా దూరం నడవాల్సి వస్తోంది. ఎందుకంటే సెక్యూరిటీ కారణాల వల్ల లోపలికి వాహనాలకు అనుమతి ఉండదు. దీనిని దృష్టిలో పెట్టుకుని రాయబార కార్యాలయం ఈ ఉచిత వాహన సర్వీస్‌ను తీసుకొచ్చింది. ప్రతిరోజు వివిధ సర్వీసుల కోసం ఎంబసీకి వచ్చే వందలాది భారత సందర్శకులకు ఈ వాహన సదుపాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రధానంగా వేసవి కాలంలో ఇది సందర్శకులకు చాలా అవసరం అని ఎంబసీ అధికారులు తెలిపారు.   

Updated Date - 2021-04-06T22:26:58+05:30 IST