విలాసాల కోసం సంస్థకే కన్నం.. ఉద్యోగి అరెస్టు
ABN , First Publish Date - 2021-06-26T14:06:38+05:30 IST
విలాసాలకు అలవాటుపడి పనిచేస్తున్న సంస్థకు కన్నం వేసిన వ్యక్తిని కేపీహెచ్బీ పోలీసులు అరెస్టు చేశారు...
హైదరాబాద్ సిటీ/హైదర్నగర్: విలాసాలకు అలవాటుపడి పనిచేస్తున్న సంస్థకు కన్నం వేసిన వ్యక్తిని కేపీహెచ్బీ పోలీసులు అరెస్టు చేశారు. 9వ ఫేజ్లో జి.వి. రఘుతేజ భవన నిర్మాణ సామగ్రిని సరఫరా చేసే వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతని వద్ద గాజులరామారానికి చెందిన చుక్క రవి చంద్రశేఖర్ (34) 18నెలలుగా పనిచేస్తున్నాడు. భవన నిర్మాణదారులు నుంచి వచ్చిన సొమ్ముని వ్యాపార లావాదేవీల్లో చూపకుండా, యజమానికి తెలియకుండా రూ.11,25,000 సొంతానికి వాడుకున్నారు.
ఆ డబ్బును తిరిగి సమకూర్చేందుకు యజమానికి తెలియకుండా సిమెంట్, స్టీలును కంపెనీ నిర్ణయించిన ధరలు కాకుండా అదనంగా అమ్మకాలు చేశాడు. మార్కెట్ కంటే అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయని రఘుతేజకు సమాచారం అందింది. రవిచంద్రశేఖర్ నిధులు దుర్వినియోగం చేశాడని నిర్ధారించుకుని అతనిపై కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని శుక్రవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ నర్సింహులు తెలిపారు.