ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-01-28T05:40:38+05:30 IST

రాష్ట్ర పీఆర్‌సీ సాధన సమితి పిలుపు మేరకు నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఆధ్వర్యంలో గురువారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.

ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభం
జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్ష చేస్తున్న దృశ్యం

పీఆర్‌సీ సాధన సమితి పిలుపు మేరకు ఆందోళనలు

విశాఖపట్నం, జనవరి 27 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర పీఆర్‌సీ సాధన సమితి పిలుపు మేరకు నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఆధ్వర్యంలో గురువారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొని పాత హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు అమలు చేయాలని, ప్రభుత్వ మొండి వైఖరిని విడనాడాలని, ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేయాలని, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్‌ కె.ఈశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ వేతన జీవులకు అన్యాయం చేసేలా తీసుకువచ్చిన చీకటి జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలు సాయంత్రం వరకు కొనసాగాయి. ఈ దీక్షలో 200 మందికిపైగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏపీ ఎన్‌జీవో జిల్లా అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ పీఎం జవహర్‌, ఉద్యోగ సంఘ నాయకులు నారాయణరావు, ధర్మేంద్రరెడ్డి, చిన్నబ్బాయి, రామకృష్ణతోపాటు వందల మంది ఉద్యోగులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-28T05:40:38+05:30 IST