ఉద్యోగుల.. ఉద్యమబాట
ABN , First Publish Date - 2021-12-08T05:32:30+05:30 IST
ఎన్నికలకు ముందు తాను అధికారంలోకి వస్తే వారంలోనే సీపీఎస్ని రద్దు చేస్తామని సీఎం జగన్ చెప్పారు... పది రోజుల్లోనే పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చారు... అయితే ప్రభుత్వ పగ్గాలు చేపట్టి 40 నెలలైనా వాటి గురించి పట్టించుకొన్న దాఖలాలు లేవని వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లావ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో నిరసన
దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఉద్యమం
గుంటూరు, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): ఎన్నికలకు ముందు తాను అధికారంలోకి వస్తే వారంలోనే సీపీఎస్ని రద్దు చేస్తామని సీఎం జగన్ చెప్పారు... పది రోజుల్లోనే పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చారు... అయితే ప్రభుత్వ పగ్గాలు చేపట్టి 40 నెలలైనా వాటి గురించి పట్టించుకొన్న దాఖలాలు లేవని వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి ఐక్యవేదిక పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కాంట్రాక్టు, పొరుగుసేవల ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. కలెక్టరేట్లోని అటవీ శాఖ కార్యాలయం వద్దకు చేరుకొన్న జేఏసీ నేతలు ప్రభుత్వ తీరుని ఎండగట్టారు. కరువుభత్యం ఐదు వాయిదాలు, 2 ఫ్రీజింగ్ డీఏలు పెండింగ్లో పెట్టారన్నారు. వేతన సవరణని మూడేళ్లనుంచి వాయిదా పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్లు రాకపోవడం వలన కనీసం వైద్య ఖర్చులకు డబ్బులు చెల్లించలేకపోతోన్నామని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులైజేషన్ హామీని కూడా విస్మరించారని చెప్పారు. ఉద్యోగులు దాచిపెట్టుకొన్న ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్కి సంబంధించి రూ.2 వేల కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టడం దారుణమన్నారు. పోరాటాల ద్వారానే తమ సమస్యలను పరిష్కరించుకొంటామన్నారు. జనవరి 6వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి నాయకులు సంగీతరావు, ఏపీఆర్ఎస్ఏ శర్మ, ఘంటసాల శ్రీనివాసరావు, శెట్టిపల్లి సతీష్కుమార్ పాల్గొన్నారు. ఏపీ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు జిల్లాపరిషత్ కార్యాలయం ముందు నినాదాలు చేశారు. కలెక్టరేట్లో విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.