‘ఉద్యోగులను వీధులపాలు చేస్తున్న ప్రభుత్వం’
ABN , First Publish Date - 2020-08-03T11:04:49+05:30 IST
విద్యార్థులు, యువకుల బలిదానాలపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో గద్దెనెక్కిన సీఎం కేసీఆర్ వారి త్యాగాలను విస్మరించి మిషన్
యాదాద్రి, ఆగస్టు2(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు, యువకుల బలిదానాలపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో గద్దెనెక్కిన సీఎం కేసీఆర్ వారి త్యాగాలను విస్మరించి మిషన్ భగీరథ, ఉపాధిహామీ ఉద్యోగులను విధుల నుంచి తొలగించి ఆయా కుటుంబాలను వీధుల పాలు చేస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య విమర్శించారు. యాదగిరిగుట్ట పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలంతో కలిసి ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న 10 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను, ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న 7,560 మంది ఫీల్డ్అసిస్టెంట్లను తొలగించడం అమానుషమన్నారు.
అధికారం చేపట్టక ముందు కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని ప్రగల్భాలు పలికి వారి మద్దతుతో అధికారం చేపట్టి వారి పొట్టకొడుతున్నాడన్నారు. కరోనా రోగులకు ఆరోగ్యశ్రీ అమలు చేయాలని కోరుతుంటే ఏమాత్రం పట్టించుకోని సీఎం కేసీఆర్ తన పాలనకు విలాసవంతమైన సౌకర్యం కోసం కొత్త సచివాలయానికి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నాడన్నారు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, మిషన్ భగీరథ, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.